గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాత సంక్షేమానికి ఎంతో కృషి చేసింది. రైతులకు పంటల సాగులో సలహాలు, సూచనలు అందించేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల్లో రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు ఎలాంటి పంటలు వేయాలి..? ఏ విత్తనాలను ఎంపిక చేసుకోవాలి..? ప్రభుత్వ పథకాలను ఏ విధంగా అందుకోవాలి..? వంటి అంశాలపై రైతులకు ఆయా క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికల్లో సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టారు.
కాగా రంగారెడ్డి జిల్లాలో మొత్తం 83 రైతు వేదికలను నిర్మించి.. వాటి నిర్వహణకు ప్రతి నెలా రూ. 9 వేలు అప్పటి ప్రభుత్వం అందించేంది. 19 నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతువేదికల నిర్వహణకు డబ్బులివ్వకపోవడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. తమ సొంత డబ్బులు ఖర్చు పెడుతుండడంతో ఆర్థికంగా చితికిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– షాబాద్, జూలై 6
జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఆమనగల్లు(కల్వకుర్తి) నియోజకవర్గాల పరిధిలోని 25 మండలాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 83 రైతువేదిక భవనాలను నిర్మించింది. ఒక్కో భవనానికి రూ. 24 లక్షల చొప్పున మొత్తం సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసింది. అందులో పెద్ద సమావేశం హాలు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ప్రత్యేక గది, అధికారులు, రైతుల కోసం కుర్చీలు, బల్లలు, మైక్సెట్, టీవీ, నెట్ కనెక్షన్తోపాటు వీడియో కాన్ఫరెన్స్కు అవకాశం కల్పించారు.
రైతువేదిక భవనాల్లో లోపల, బయట వ్యవసాయ పంటలకు సంబంధించిన బొమ్మలు వేయడంతోపాటు పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంశాలను గోడలపై రాయించారు. ఈ భవనాలను సకల సౌకర్యాలతో నిర్మించింది. రైతువేదికల నిర్వహణకు ప్రతినెలా రూ.9,000 చొప్పున ప్రభుత్వం అందించింది. అధికారులు క్లస్టర్ల వారీగా ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతాల్లో ఈ నిధులు జమయ్యేవి. ప్రస్తుతం ఆ నిధులు రాకపోవడంతో నిర్వహణలో ఇబ్బందులు తప్పడంలేదు.
భారంగా మారిన నిర్వహణ
వ్యవసాయ క్లస్టర్ పరిధిలోని రైతు వేదికల నిర్వహణకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 19 నెలలుగా నయా పైసా ఇవ్వడంలేదు. దీంతో సంబంధిత ఏఈవోలు తమ సొంత డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. నిర్వహణ ఖర్చులు రోజురోజుకూ పెరిగి అదనపు భారం మీదపడడంతో ఏఈవోలు తలలు పట్టుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వీపర్కు రూ.3,000., సమావేశాలు, శిక్షణ కోసం రూ.2,500., స్టేషనరీకి రూ.1000., తాగునీటి కోసం రూ.500., మరమ్మతులు, ఇతర ఖర్చులకు రూ.1000., కరెంటు బిల్లుకు రూ.1000 కలిపి మొత్తం నెలకు రూ.9వేలు అందించేది. కాంగ్రెస్ సర్కారు ఈ నిధులు విడుదల చేయకపోవడంతో గత 19 నెలలుగా వాటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ సర్కార్ ఈ రైతు వేదికల్లోనే రైతునేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా నిధులు ఇవ్వకపోవడంతో అధికారులకు కష్టంగా మారింది.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం
రైతు వేదికల నిర్వహణకు సంబంధించి ప్రతినెలా రావాల్సిన నిధులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జిల్లాలో 83 రైతువేదికలుండగా వాటి నిర్వహణకు ప్రతినెలా రూ.9 వేలు అందించాల్సి ఉండగా.. గత 19 నెలలుగా నిధులు రావడంలేదు. నెలవారీ ఖర్చులను ఏఈవోలు సొంతంగా పెట్టుకుంటున్నారు.
– నర్సింహారావు, వ్యవసాయశాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా