షాబాద్, ఫిబ్రవరి 1 ; ‘మన ఊరు-మన బడి’తో సర్కారు బడులు మెరిసి మురిశాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సకల సౌకర్యాలతో రూపుదిద్దుకున్న స్కూళ్లను బుధవారం మంత్రి, ప్రజాప్రతినిధులు పండుగ వాతావరణంలో ప్రారంభించారు. వికారాబాద్ జిల్లాలో 6 స్కూళ్లు షురూ కాగా, రంగారెడ్డి జిల్లాలో 8 పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కందుకూరు మండలం రాచులూరు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలను మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 464 పాఠశాలలకు అన్ని సదుపాయాలు సమకూరాయన్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడ ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రారంభించగా, కడ్తాల్ మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆమనగల్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ప్రారంభించారు.
ఫరూఖ్నగర్ మండలంలోని గంట్లవెల్లి, రాయికల్ గ్రామాల్లోని ప్రభుత్వ బడులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించారు. వికారాబాద్ జిల్లాకు సంబంధించి వికారాబాద్ నియోజకవర్గం మోమిన్పేట్ మండలంలోని చంద్రాయన్పల్లి, అమ్రాదికుర్దు ప్రాథమిక పాఠశాలలను ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని కందనెల్లి ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, కొడంగల్ నియోజకవర్గం బొంరాసుపేట మండలంలోని చెట్టుపల్లి తండా, దౌల్తాబాద్ మండలం నర్సాపూర్ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలోని మన్నెగూడ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు. సకల సౌకర్యాలతో సర్కారు బడుల రూపురేఖలు మారడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షధ్వానాలు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. కనీసం బ్లాక్ బోర్డులు కూడా ఉండేవి కావు. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకొని మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగి అభివృద్ది చెందనున్నట్లు ఉపాధ్యాయులు, విద్యార్థులు పేర్కొంటున్నారు.
మన ఊరు-మన బడితో ఎంపికైన కొన్ని పాఠశాలల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రీన్ చాక్బోర్డులు, పెయింటింగ్, ప్రహరీలు, కిచెన్ షెడ్ల నిర్మాణం, శిధిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణాలు జరిగాయి. మిగతా పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ ‘సమస్యలు లేని సర్కారు బడులు’గా మారుస్తున్నది. అన్ని రకాల పనులు పూర్తికావస్తుండడంతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు. ఈ సౌకర్యాలతో పాఠశాలలు బలోపేతం కావడంతోపాటు, విద్యార్థుల హాజరు శాతం కూడా పెరుగనుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
పెద్దేముల్, ఫిబ్రవరి 1 : పెద్దేముల్ మండలంలో మొదటి విడుతలో 10 ప్రాథమిక, 2 ప్రాథమికోన్నత, 7 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేయగా ప్రస్తుతం రెండు ప్రాథమిక పాఠశాలల్లో పనులు పూర్తి కావస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.4,63,78,000 నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ముందస్తుగా కందనెల్లి, మంబాపూర్ ప్రాథమిక పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా పరిగణనలోకి తీసుకోగా పనులు పూర్తి కావస్తున్నాయి. కందనెల్లి ప్రాథమిక పాఠశాలలో రూ.14లక్షల81వేలతో పెయింటింగ్, ఎలక్ట్రిసిటీ, తాగునీటి సౌకర్యాలను కల్పించారు. మంబాపూర్ ప్రాథమిక పాఠశాలలో రూ.2లక్షల40వేలతో పెయింటింగ్, ఎలక్ట్రిసిటీ, మరమ్మతు పనులను పూర్తి చేశారు.
మన ఊరు – మన బడి కింద ఎంపికైన పాఠశాలలు
ప్రాథమిక పాఠశాలలు : అడికిచెర్ల, ఇందూరు, ఇందూరు ఉర్దూమీడియం, కందనెల్లి, మంబాపూర్, మారేపల్లి, పాషాపూర్, పెద్దేముల్, తట్టేపల్లి, ఊరెంటితండా. ప్రాథమికోన్నత పాఠశాలలు : జనగాం, నాగులపల్లి. ఉన్నత పాఠశాలలు : పెద్దేముల్ బాలురు, బాలికలు, అడికిచెర్ల, ఇందూరు ఉర్దూమీడియం, కందనెల్లి, మంబాపూర్, మారేపల్లి
బంట్వారం, ఫిబ్రవరి 1 : మండల వ్యాప్తంగా ఏడు పాఠశాలలను ఎంపిక చేయగా.. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో తొరుమామిడి ఉర్దూ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలతోపాటు, తెలుగు మాద్యమ పాఠశాలలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, బొపునారం యూపీఎస్, బంట్వారం ఎంపీఎస్, సల్బత్తాపూర్లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో ప్రస్తుతం బొపునారం, సల్బత్తాపూర్, తొరుమామిడి పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. సుమారు 80 శాతం పనులు తొరుమామిడి ప్రాథమిక(ఉర్దూ)పాఠశాలలో పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
తొరుమామిడి ఉర్దూ పాఠశాలకు రూ.30 లక్షలను కేటాయించగా.. విద్యుత్ సరఫరా, మరమ్మతులకు 2 లక్షలు, తాగునీటి సరఫరాకు 1.36 లక్షలు, పాఠశాల భవనం మరమ్మతులకు 1.75 లక్షలు, ఇతర సామగ్రి, ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మరమ్మతులు, రంగులు వేయడం, విద్యుత్ సౌకర్యం కల్పించే పనులు పూర్తికాగా.. తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, వంట గది నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఉర్దూ ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు రూ.37 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ప్రధానంగా డైనింగ్ హాల్, ఫ్లోరింగ్, భవన మరమ్మతులు, కిటికీలు, తలుపులు తదితర పనులు, దీంతోపాటు పాఠశాలకు రంగులు, విద్యుత్ సరఫరా మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం చేయనున్నారు.
‘మన ఊరు-మన బడి’ ఓ వరం లాంటిది
– వెంకటయ్యగౌడ్, ఇన్చార్జి ఎంఈవో, పెద్దేముల్ మండలం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం సర్కారు బడులకు ఒక వరం లాంటిది. మండలంలో 19 పాఠశాలలు ఎంపికై నిధులు కూడా మంజూరు అయ్యాయి.ఆయా గ్రామాల సర్పంచులు, ఎస్ఎంసీ చైర్మన్లు, పాఠశాలల సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటును అందించాలి. పనులు పూర్తై ఎంబీ రికార్డు అయిన వారం రోజుల్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. డబ్బులు రావనే అపోహలు ఎవ్వరు కూడా పెట్టుకోవద్దు. ఎన్నో ఎండ్ల తరువాత సర్కారు బడుల అభివృద్ధికి నిధులు వచ్చాయి.
మా పాఠశాల మోడల్గా ఎంపిక కావడం ఆనందంగా ఉంది
– హెచ్ఎం రాములు, నవాబుపేట ప్రాథమిక పాఠశాల
భవనాలకు మరమ్మతులు చేయడంతోపాటు రంగులు, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రహరీలను నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులకు కావాల్సిన సకల సౌకర్యాలతోపాటు క్రీడాప్రాంగణాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం. ప్రభుత్వానికి మా విద్యార్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
మా బడి మంచిగా అవుతుంది
మా బడికి రంగులు వేయడంతో మంచిగా కనిపిస్తున్నది. నీళ్లు, కంపౌండ్, మూత్రశాలలు కడుతుండడంతో పాఠశాల నుంచి బయటకు వెళ్లే పనిలేదు. ఇంటి నుంచి పాఠశాలకు వస్తే.. పాఠశాల ముగిసిన తరువాత ఇంటికి వెళ్లేదే ఉంటుంది. ఇంతకు ముందు నీళ్లకు, మూత్రానికి ఇంటికి వెళ్లాల్సి వచ్చేది.
– షేక్ అబ్దుల్ ఉజైర్. అంగడిరైచూర్, కొడంగల్
పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం
జిల్లా అధికారుల ఆదేశం మేరకు పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. మండలంలోని ప్రతి పాఠశాలలోని జరుగుతున్న వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. సకాలంలో పూర్తి చేసేలా సర్పంచ్లు, కాంట్రాక్టర్లకు సూచిస్తున్నాం. పనులన్నీ నాణ్యతగా జరిగేలా చూస్తున్నాం.
– చంద్రప్ప, ఎంఈవో, బంట్వారం
గతంలో వసతులు లేక నానా ఇబ్బందులు పడ్డాం
గతంలో మా పాఠశాలలో సరైన వసతులు లేక నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడిపాం. సీఎం కేసీఆర్ సార్ మా పాఠశాలకు పెయింటింగ్, ఎలక్ట్రిసిటీ, తాగునీటి సౌకర్యం, మైనర్ మరమ్మతులు చేయించి మా ఇబ్బందులను తొలగించారు. ప్రస్తుతం పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో హాయిగా చదువుకుంటాం.
– సాదియా సుల్తానా, 5వ తరగతి విద్యార్థిని, మంబాపూర్ ప్రాథమిక పాఠశాల
ప్రభుత్వానికి, డీఈవోకు ధన్యవాదాలు
విద్యావ్యవస్థలో నాకు 33 ఏండ్ల అనుభవం ఉంది. నా సర్వీసులో ఇంత పెద్ద మొత్తంలో సర్కారు బడుల మరమ్మతులు, పెయింటింగ్, ఇతర పనులకు నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం అన్ని రకాల పనులు పూర్తయ్యాయి. మా పాఠశాలను ఎంపిక చేసినందుకు, అందుకు సహకరించినందుకు ప్రభుత్వానికి, డీఈవోలకు పాఠశాల తరఫున ధన్యవాదాలు.
– వారిజ, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, కందనెల్లి ప్రాథమిక పాఠశాల (పెద్దేముల్)