రంగారెడ్డి, మే 9 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. వికారాబాద్ జిల్లాలో గతంతో పోలిస్తే ఫలితాలు మెరుగుపడగా, రంగారెడ్డి జిల్లాకు రాష్ట్రంలోనే 5వ స్థానం దక్కింది. ఇందులో ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం అధికంగా ఉండడం గమనార్హం. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకుగాను రంగారెడ్డి జిల్లాలో 1,27,664 మంది పరీక్షలు రాయగా, 93,245 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వికారాబాద్ జిల్లాలో 16,841 మంది పరీక్షలు రాయగా, 9142 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 73 శాతం, వికారాబాద్ జిల్లాలో 60 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలికలదే పైచేయిగా నిలిచింది. ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఒకరినొకరు స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 4వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగనుండగా, ఫీజు చెల్లింపునకు ఈ నెల 16వ తేదీ చివరి గడువు అని ఉమ్మడి జిల్లా యంత్రాంగం పేర్కొన్నది.
ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది. మంత్రి సబితారెడ్డి మంగళవారం నాంపల్లిలోని రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. జిల్లాకు ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తంగా 73 శాతం ఉత్తీర్ణత లభించింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఓవరాల్ పర్సంటేజీ 2 శాతం తగ్గి, గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ర్యాంక్ 3, కాస్త 5కు చేరింది. జనరల్ ఇంటర్మీడియెట్ సెకండియర్కు జిల్లాలో 53,050 మంది విద్యార్థులు హాజరు కాగా, 38,958 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం (జనరల్) 73 శాతం, ఒకేషనల్లో 71 శాతం లభించింది. ఇంటర్ ద్వితీయంలో ఒకేషనల్ కోర్సుకు 2837 మంది విద్యార్థులు హాజరవగా, 2022 మంది పాసయ్యారు. రాష్ట్రంలో రంగారెడ్డి 5వ ర్యాంక్లో నిలిచినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ అధికారి వెంక్యానాయక్ వెల్లడించారు.
అత్త్యుత్తమం.. ఉన్నతం..
రాష్ట్రవ్యాప్తంగా బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 54.66 శాతం ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోనూ అమ్మాయిలే ఉత్తమంగా, ఉన్నతంగా నిలిచారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో (36,149/25,333) బాలురు 70% ఉత్తీర్ణత సాధించగా, బాలికలు (32,140/25,100) 78% పాసయ్యారు. కాగా, ఒకేషనల్ కోర్సుల్లో బాలురు (1878/679) 36%, బాలికలు (1610/1153) 71% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలురు (27,601/19,047) 69% ఉత్తీర్ణత సాధించగా, బాలికలు (25,449/19,864) 78% పాసయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో బాలురు (1,477/892) 60%, బాలికలు (1,360/1,130) 83% ఉత్తీర్ణత సాధించారు.
ఒకేషనల్లో 71%..
ఇంటర్మీడియెట్ రెగ్యులర్ విద్య మాదిరిగానే ఒకేషనల్ విద్యలోనూ బాలికలదే పైచేయిగా కొనసాగింది. ఒకేషనల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి (1,477 మంది బాలురు, 1,360 మంది బాలికలు) 2,837 మంది పరీక్షలకు హాజరవగా, (892 మంది బాలురు, 1,130 మంది బాలికలు) 2,022 మంది పాసయ్యారు. (బాలురు 60% ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 83%) 71% ఓవరాల్గా ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం 71% సాధించి గత సంవత్సరం కంటే 13% మెరుగ్గా నిలిచింది. ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో (బాలురు 1,878 మంది, 1,610 మంది బాలికలు) 3,488 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా, (679 మంది బాలురు, 1,153 మంది బాలికలు) 1832 మంది ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం కంటే ఐదు శాతం పాయింట్లు మెరుగై ఓవరాల్గా (బాలురు 36, బాలికలు 71) 52% ఉత్తీర్ణత సంపాదించారు.
గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం
వికారాబాద్, (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలకు సంబంధించి జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో అధిక మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలో 60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. జిల్లా రాష్ట్రస్థాయిలో 25వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెరగడం గమనార్హం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం గతేడాదితో పోలిస్తే తగ్గింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయారు. మరోవైపు జూన్ 4 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు, సప్లిమెంటరీ పరీక్షా ఫీజు చెల్లింపునకుగాను ఈ నెల 16 వరకు గడువు విధించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.
బాలికలదే పైచేయి..
జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 16,841 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 9142 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 6459 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకాగా 60 శాతంతో 3909 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణులైన బాలురకు సంబంధించి 2935 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 53 శాతం ఉత్తీర్ణతతో 1564 మంది పాసయ్యారు. బాలికలకు సంబంధించి 3524 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 66 శాతం ఉత్తీర్ణతతో 2345 మంది పాసయ్యారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షా ఫలితాలకు సంబంధించి రాష్ట్రస్థాయిలో జిల్లా 30వ స్థానంలో నిలువగా 46 శాతం మేర విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 7859 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3618 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 54 శాతం ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో ఉండగా 37 శాతంతో బాలురు పూర్తి వెనుకంజలో నిలిచారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 3962 మంది పరీక్షలకు హాజరుకాగా 2168 మంది పాసయ్యారు.
3897 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 1450 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ ఇంటర్ ఫలితాల్లో జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సర ఫలితాలకు సంబంధించి 1374 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 54 శాతం ఉత్తీర్ణతతో 742 మంది పాసయ్యారు. వీరిలో బాలురు 490 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 32 శాతం ఉత్తీర్ణతతో 158 మంది ఉత్తీర్ణులుకాగా, బాలికలకు సంబంధించి 884 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా 66 శాతం ఉత్తీర్ణతతో 584 మంది పాసయ్యారు. ఒకేషనల్ ద్వితీయ సంవత్సర ఫలితాలకు సంబంధించి జిల్లాలో 1149 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 75 శాతం ఉత్తీర్ణతతో 873 మంది పాసయ్యారు. వీరిలో 384 బాలురు పరీక్షలకు హాజరుకాగా 56 శాతం ఉత్తీర్ణతతో 217 మంది, 765 బాలికలు పరీక్షలకు హాజరుకాగా 85 శాతం ఉత్తీర్ణతతో 656 మంది పాసయ్యారు.
అధైర్యపడొద్దు.. ఆత్మహత్య చేసుకోవద్దు
ఇబ్రహీంపట్నం : పరీక్షల్లో ఫెయిల్ అయి.. క్షణికావేశాలతో ఆత్మహత్యలకు పాల్పడవద్దు.. ఫెయిల్ అయినవారు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండటం కోసమే వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆత్మహత్యలు అన్ని సమస్యలకు పరిష్కారం కావని విద్యార్థులు భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. మంగళవారం ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించగా.. రంగారెడ్డిజిల్లాలో 73 శాతం ఉత్తీర్ణులయ్యారు. పదోతరగతిలో 49,500 మంది పరీక్షలు రాసారు. బుధవారం పదోతరగతి ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిల్ అయినవారు జరిగిన తప్పును సరిదిద్దుకోవడం కోసం మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు రాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. పదోతరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధిస్తే చాలు ఎంసెట్కు అవకాశం కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
అధైర్యపడొద్దు.. అవకాశాలెన్నో ఉన్నాయి : సుశీందర్రావు, డీఈవో
పది, ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడొద్దు. నెలరోజుల వ్యవధిలోనే సప్లిమెంటరీ పరీక్షలు ప్రభుత్వం నిర్వహించనున్నది. మళ్లీ కష్టపడి చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎంసెట్కు హాజరయ్యేవారికి కూడా పది, ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండా అవకాశాలు కల్పిస్తున్నారు. ఫెయిల్ అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పట్టుదలతో చదివి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి.
క్షణికావేశానికి గురికావద్దు ; ఉమామహేశ్వర్రావు, ఏసీపీ, ఇబ్రహీంపట్నం
ఓటమి గెలుపునకు పునాది లాంటిది. పది, ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులు క్షణికావేశాలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆత్మహత్యలే అన్నింటికీ శరణ్యం కాదు. ఒక్కసారి ఓడినవారు మరోసారి గెలుపును సాధించాలని ముందుకెళ్లాలి. ఫెయిల్ అయిన సబ్జెక్టులపై దృష్టి సారించి బాగా చదువుకుని చేసిన తప్పును సరిదిద్దుకోవాలి.