వికారాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 52 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. గెలిచిన అభ్యర్థితోపాటు సమీప ప్రత్యర్థి మినహా మిగతా ఎవరికీ డిపాజిట్ దక్కలేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో గెలుపొందినవారు, సమీప ప్రత్యర్థులు కాకుండా పరిగి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బూనేటి కిరణ్ మాత్రమే డిపాజిట్ సాధించారు. మిగతా వికారాబాద్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులకూ డిపాజిట్ దక్కకపోవడం గమనార్హం.
కమలం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అస్సాం సీఎం, జార్ఘండ్ మాజీ సీఎం అర్జున్ ముండా వచ్చి ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. వికారాబాద్ నియోజకవర్గంలో 10 మంది, పరిగి 12 మందికి, తాండూరు 19 మంది, కొడంగల్ 11 మంది అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. కొందరు అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం. అదేవిధంగా జిల్లాలో అత్యధిక ఓట్ల శాతం కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి వచ్చింది. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి 55.04 శాతం ఓట్లు, వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే జి.ప్రసాద్కుమార్కు 48.67 శాతం ఓట్లు, పరిగి ఎమ్మెల్యే టీ.రామ్మోహన్ రెడ్డికి 48.38 శాతం ఓట్లు, తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డికి 48.36 శాతం ఓట్లు, వచ్చాయి.
అదేవిధంగా గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే వికారాబాద్, తాండూరు నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగింది. కొడంగల్ నియోజకవర్గంలో 12 శాతం ఓట్లు పెరగగా, వికారాబాద్ నియోజకవర్గంలో 11 శాతం, పరిగి నియోజకవర్గంలో 10 శాతం, తాండూరు నియోజకవర్గంలో 4 శాతం మేర ఓట్లు పెరిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వికారాబాద్ నియోజకవర్గంలో 4 శాతం మేర ఓట్లు, తాండూరు నియోజకవర్గంలో 1 శాతం ఓట్లు పెరగగా, పరిగి నియోజకవర్గంలో 10 శాతం, కొడంగల్ నియోజకవర్గంలో 10 శాతం మేర ఓట్లు తగ్గాయి.