రంగారెడ్డి, జనవరి 26(నమస్తే తెలంగాణ): ప్రజా పాలన అభయ హస్తం ఐదు పథకాల లబ్ధిదారులు ఎక్కువగా మహాలక్ష్మి పథకానికే దరఖాస్తు చేశారు. జిల్లావ్యాప్తంగా మహాలక్ష్మి కింద అందించే రూ.2,500 నగదు కోసం 4,56,839 మంది దరఖాస్తు చేశారు. మహాలక్ష్మి పథకంలోనే మరో పథకం రూ.500 గ్యాస్ సిలిండర్ కావాలని 4,32,676 మంది దరఖాస్తు చేశారు.
ఐదు పథకాలకు మొత్తం 20,99,208 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 6 వరకు ఐదు గ్యారెంటీ స్కీంలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. రంగారెడ్డి జిల్లాలో 21 మండలాల్లోని 558 గ్రామ పంచాయతీల పరిధిలో 2,46,626 కుటుంబాలు ఉన్నాయి.
వీటి పరిధిలో నుంచి 2,95,060 కుటుంబాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. అలాగే 16 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 2,88,361 కుటుంబాలు ఉండగా..2,14,789 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటన్నింటికి ఆధార్, రేషన్ కార్డులను అనుసంధానం చేసి దరఖాస్తుల్లోని సమాచారా న్ని పోల్చి పథకాల దరఖాస్తులను ప్రత్యేక సాఫ్ట్వేర్తో వేర్వేరుగా విభజించారు.