‘ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు నమ్మొద్దు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి..’ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కందుకూరు మండల పరిధిలోని దెబ్బడగూడ, ముచ్చర్ల, బేగంపేట్, సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన దాదాపుగా 400 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అద్భుత ప్రగతిని సాధిస్తున్న తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు కావట్లేదో అర్థం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, మెతుకు ఆనంద్, అంజయ్యయాదవ్ల సమక్షంలో పలువురు బీఆర్ఎస్ చేరారు.
– కందుకూరు, ఆగస్టు 27
కందుకూరు, ఆగస్టు 27 : కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కోరారు. మండల పరిధిలోని దెబ్బడగూడ, ముచ్చర్ల, బేగంపేట్, సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన దాదాపు 400 మంది కాంగ్రెస్, బీజేపీ లకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలను కప్పారు. మంత్రిని గెలిపించుకుంటామని, కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులను నమ్మబోమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పాలిత రాష్ర్టాల్లో మన పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తనకు బలం, బలగం పార్టీ కార్యకర్తలు అని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ మరొకసారి నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే అదృష్టం కలిగించినట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే ఎవరు సీఎం అవుతారో చెప్పాలని ప్రశ్నించారు. ఆ పార్టీలు గెలిస్తే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాలని వివరించారు.
ఓ వైపు చేరికలు.. మరో వైపు సమ్మేళనాలు
ఇబ్రహీంపట్నం : వచ్చే ఎన్నికలకు ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిరెడ్డి కిషన్రెడ్డిని ప్రకటించినప్పటి నుంచి నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతోపాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల నుంచి పెద్దఎత్తున తరలివచ్చి ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఆదివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్, యాచారం మండలంలోని కొత్తపల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన యువకులు ఎమ్మెల్యే కిషన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నంకు చెందిన వర్తక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిరణప్ప పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమ పాలన
వికారాబాద్ : బీఆర్ఎస్ పార్టీతోనే ప్రజా సంక్షేమ పాలన సాధ్యమవుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే నివాసం వద్ద వికారాబాద్ మండల పరిధిలోని కొటాలగూడ, ధారూరు మండలం అవుసుపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషితో గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వివరించారు. పార్టీలో చేరినవారికి గుర్తింపు ఉంటుందన్నారు. 100 మంది వరకు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, కోటాలగూడ సర్పంచ్ రాములునాయక్ ఉన్నారు.
తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్
షాద్నగర్ : ప్రభుత్వ పాలన, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగా చౌదరిగూడ మండలం ఇంద్రానగర్, ఫరూఖ్నగర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఆదివారం షాద్నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని పేర్కొన్నారు. నిరంతరం రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసే సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలువాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలను కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేష్, నాయకులు పాల్గొన్నారు.