షాబాద్, మార్చి 29 : రోజురోజుకూ ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 9గంటల నుంచే సూరీడు భగభగ మండుతున్నాడు. వరుసగా గత నాలుగు రోజుల నుంచి రంగారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38 నుంచి 40డిగ్రీలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఏకంగా 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఎండకు తాళలేని ప్రజలు కొబ్బరిబొండాలు, శీతలపానీయాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల కారణంగా జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఎండ దెబ్బ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.