రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’తో వాహనాలు, వ్యవసాయ పని ముట్లు, ట్రాక్టర్లు తదితర యూనిట్లు అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించడం జరుగుతున్నదని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి కలెక్టర్ మాట్లాడారు. ‘మన ఊరు-మన బడి’ మొదటి విడుతలో 371 పాఠశాలలను ఎంపిక చేయగా, రూ.6.45కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. 2022-23 సంవత్సరానికి గాను జిల్లాలో 6,284 కేసీఆర్ కిట్లను అందజేసినట్లు తెలిపారు. అనంతగిరి అడవిలో 750 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సహజ సిద్ధ ఔషధ మొక్కలను కాపాడేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన 187 మంది అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందజేశారు.
వికారాబాద్, జనవరి 26 : అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జిల్లా ముందంజలో దూసుకుపోతున్నదని వికారాబాద్ కలెక్టర్ నిఖిల తెలిపారు. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడారు.