పెద్దఅంబర్పేట, ఫిబ్రవరి 3 : మూడు వేల లీటర్ల నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. సరూర్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.రవీందర్రావు సమక్షంలో హయత్నగర్ సీఐ టీ లక్ష్మణ్గౌడ్, ఇబ్రహీంపట్నం సీఐ టీ శ్రీనివాస్రెడ్డి కలిసి శనివారం పెద్దఅంబర్పేటలో 358 కార్టన్ల నకిలీ మద్యాన్ని జేసీబీ సాయంతో పగులగొట్టారు. రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసును ఎక్సైజ్ పోలీసులు ఛేదించారు.
దాదాపు ఏడాది కిందట ఒడిశాలోని కటక్ అభయారణ్యంలో ఏర్పాటు చేసిన అనుమతిలేని చట్ట విరుద్ధమైన మద్యం తయారీ పరిశ్రమను ధ్వంసం చేసి రూ.8 కోట్ల ఆర్థిక నష్టాన్ని కలిగించారు. అక్కడ లభించిన 358 కేసుల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ ముగిసిన అనంతరం ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నకిలీ మద్యాన్ని ధ్వంసం చేశారు.
ప్రాథమిక రసాయన పరీక్షల అనంతరం, ఇది తాగేందుకు హానికరమైనదిగా భావించి ధ్వంసం చేసేందుకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు, ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన 35 బస్తాల (1050 కిలోల) నల్లబెల్లాన్ని గౌరెల్లి వద్ద మూసీ నదిలో పారబోశారు. కార్యక్రమంలో డీటీఎఫ్ సీఐ టీ సత్యనారాయణ, ఎస్సైలు యాదయ్య, వెంకన్న, హనుమంతు, సరళ తదితరులు పాల్గొన్నారు.