బొంరాస్పేట, మే 26 : పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా తెలుగు, ఆంగ్లం మాధ్యమా ల్లో రెండు భాగాలుగా ముద్రించి పంపిణీ చేస్తున్నది. పార్ట్-1 పాఠ్య పుస్తకాలను విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే ప్రింట్ చేసి అందిస్తుండగా.. పార్ట్-2 పాఠ్య పుస్తకాలను దసరా సెలవుల తరువాత పాఠశాలలకు సరఫరా చేస్తారు.
ప్రస్తుతం పార్ట్-1 పాఠ్య, నోటు పుస్తకాలు జిల్లాకు వచ్చాయి. వాటిని మండలాలకు పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాకు ఈ విద్యాసంవత్సరంలో పార్ట్-1, పార్ట్-2 కలిపి మొత్తం 7,19,410 పాఠ్య పుస్తకాలు అవసరం. వాటిలో 5,27,030 పార్ట్-1 పాఠ్యపుస్తకాలు జిల్లాకు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 3,38,810 వచ్చాయి. అదేవిధంగా 4,60,422 నోటు పుస్తకాలు రావాల్సి ఉండగా 2,22,600 జిల్లాకు వచ్చాయి. వచ్చే నెల 12వ తేదీన పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 96,502 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను సర్కారు పంపిణీ చేస్తుండగా.. 6 నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను కూడా అందిస్తున్న ది. 1 నుంచి ఐదోతరగతి వరకు చదివే విద్యార్థులకు వర్క్బుక్కులు, 6, 7, 8, 9,10వ తరగతి చదువుతున్న వారికి 14, ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు 10, రెండోఏడాది విద్యార్థులకు 12 నోటు పుస్తకాలను ఉచితంగా అందజేస్తారు.