షాబాద్, మార్చి 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో సంబురంగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. శిబిరాలకు వచ్చిన వారికి వైద్యులు కంటి పరీక్షలు చేస్తూ అవసరమైన వారికి ఉచితంగా అద్దాలతోపాటు, మందులను పంపిణీ చేస్తున్నా రు. గురువారం జిల్లాలోని 80 వైద్య బృందాలు 14,397 మందికి కంటి పరీక్షలు చేయగా.. అందులో 928 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 806 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రాలను జిల్లా, డివిజన్ స్థాయి ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కంటి పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో
బొంరాస్పేట, మార్చి 23 : అంధత్వం, కంటి జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. గురువారం జిల్లాలో 6,078 మందికి కంటి పరీక్షలు చేయగా.. అందులో 736 మందికి రీడింగ్ గ్లాస్స్ అందించారు. 692 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటివరకు 258 గ్రామాలు, 53 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు వికారాబాద్ డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
దూరం చూపుతో ఇబ్బందిగా ఉండే..
కంటి వెలుగు కార్యక్రమంతో మాలాంటి వారికి ఎంతో మేలు జరుగుతున్నది. ప్రైవేట్ దవాఖానలకెళ్లి చూపించుకునే ఆర్థిక స్థోమత లేదు. వైద్యులు గ్రామాలకే వచ్చి కంటి పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు, మందులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు దూరం చూపుతో కొంత ఇబ్బందిగా ఉండేది.
మా గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంలో నన్ను వైద్యులు పరీక్షించి అద్దాలు ఇచ్చారు. దాంతో ఆ సమస్య తీరనున్నది.
-భీమయ్య, గొల్లపల్లి, చేవెళ్ల మండలం