మొయినాబాద్, జనవరి 24 : గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయి. రెండేండ్ల పాటు కురిసిన వర్షాలు, పంచాయతీరాజ్ రోడ్ల మీద సామర్థ్యానికి మించిన భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. రోడ్లపై గుంతలు పడడంతో ప్రయాణం నరకయాతనగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారడంతో గత ప్రభుత్వం మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. ఆ రోడ్ల పనులకు సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ప్రొసీడింగ్లను విడుదల చేసింది.
నిధుల మంజూరు తర్వాత అప్పటి ప్రభుత్వం టెండర్లను కూడా పిలిచింది. కొన్ని పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాగా.. మరికొన్ని పనులకు ముందుకు రాలేదు. అంతలోనే సాధారణ ఎన్నికలు రావడంతో పనులకు టెండర్లను మళ్లీ పిలువలేకపోయారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో నిధులు మంజూరైనా రోడ్ల అభివృద్ధి మాత్రం అటకెక్కింది. పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు వాటిని ప్రారంభించడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మొయినాబాద్ మండలంలోని 10 రోడ్లను అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం 2023లో ఆగస్టు 11న నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్లను విడుదల చేసింది. నిధుల మంజూరు తర్వాత అప్పటి విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డిలు ఆయా గ్రామాల రోడ్ల పనులను ప్రారంభించేందుకు 2023 సెప్టెంబర్ 11న శంకుస్థాపనలు చేశారు. పనులకు టెండర్ కాల్ చేసి త్వరగా పనులు ప్రారంభించాలని వారు సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతలోనే ఎన్నికలు రావడంతో టెండర్ కాల్ ఆగిపోయింది.
రోడ్ల పనులను చేయడానికి కాంట్రాక్టర్లు ఎన్నికలకు ఆరు నెలల ముందే అగ్రిమెంట్లు చేసుకున్నారు. అయితే పనులను ప్రారంభించడం లేదు. అధికారులు చెప్పినా స్పందించడం లేదు. ఈ అగ్రిమెంట్లను రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కనకమామిడి నుంచి వెంకటాపూర్ వరకు రోడ్డు అభివృద్ధికి రూ.6.50 కోట్లు మంజూరయ్యాయి. వీటితో పాటు పెద్దమంగళారం నుంచి చందానగర్ గేట్ వరకు ఉన్న రోడ్డు పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులను ప్రారంభించడం లేదు.
అజీజ్నగర్ పాత గేట్ (హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి నుంచి) నుంచి వయా అజీజ్నగర్, నాగిరెడ్డిగూడ మీదుగా బాకారం వరకు రోడ్డు అభివృద్ధి కోసం రూ.13 కోట్లు మంజూరయ్యాయి. పనులు నాగిరెడ్డిగూడ వరకు పూర్తయ్యాయి. నాగిరెడ్డిగూడ నుంచి బాకారం వరకు పనులు చేయడానికి నిధులు సరిపోకపోవడంతో మరో రూ.3 కోట్లు అదనంగా మంజూరయ్యాయి. ఆ పనులను చేయాల్సి ఉన్నది. మిగిలిన గ్రామాల రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మళ్లీ టెండర్లు పిలవాల్సి వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఎన్నికలకు ముందు మండలంలోని పది గ్రామాల రోడ్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. కొన్ని పనులను కాంట్రాక్టర్లు దక్కించుకుని అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయి. పనులు మొదలు పెట్టాలని కాంట్రాక్టర్లకు సూచిస్తున్నాం. త్వరలోనే పనులను మొదలు పెట్టిస్తాం. ఎన్నికలకు ముందే అన్ని రోడ్ల పనులకు టెండర్ కాల్ చేశాం.
కానీ కొన్ని రోడ్ల పనుల టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. మిగిలిపోయిన రోడ్లకు మళ్లీ టెండర్ కాల్ చేస్తాం. టెండర్ కాల్ పూర్తి కాగానే పనులను మొదలు పెట్టిస్తాం. కొన్ని రోడ్లకు కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు చేసుకున్నారు. పనులను త్వరగా మొదలు పెట్టాలని ఆదేశిస్తున్నాం. త్వరలోనే మొదలు పెడుతామని చెబుతున్నారు.
– విజయ్కుమార్, డీఈ, పంచాయతీ రాజ్
సురంగల్ నుంచి శ్రీరాంనగర్, వెంకటాపూర్ వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో గుంతలు ఏర్పడ్డాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. రోడ్డు మీద వాహనాలను నడిపాలంటేనే నరకం అనుభవిస్తున్నాం.
అత్యవసర పరిస్థితిలో దవాఖానకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నాం. మధ్యలోనే ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తున్నది. నిధులు మంజూరైనా ఇప్పటివరకు పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ ప్రభుత్వం పనులను పూర్తి చేస్తే ప్రజలకు చాలా మేలు జరుగనున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.
– మంగళారం జంగారెడ్డి, శ్రీరాంనగర్, మొయినాబాద్