బొంరాస్పేట, ఫిబ్రవరి 12 : మండలంలోని మహాంతిపూర్ ప్రజలకు వాగు కష్టాలు తీరనున్నాయి. గ్రామానికి బీటీ రోడ్డు, వంతెన నిర్మా ణానికి ప్రభుత్వం రూ.23.86 కోట్లు మంజూరు చేసింది. కాకరవాణి వాగు ఒడ్డున ఉన్న ఈ గ్రామ ప్రజలకు వర్షాకాలం వస్తే పొలాలకు వెళ్లా లన్నా, మండల కేంద్రానికి రావాలన్నా నానా అవస్థలు పడేవారు. భారీ వర్షాలు కురిసి వాగు నిండుగా ప్రవహిస్తే వాగు దాటి ఇవతలి ఒడ్డుకు రాలేని పరిస్థితి. బొంరాస్పేట మండల కేంద్రం నుంచి గ్రామానికి నేటికీ పక్కా రోడ్డు సౌకర్యం లేదు. గ్రామం నుంచి మండల కేంద్రం మూడు కిలోమీటర్ల దూరమే ఉన్నా సరైన రోడ్డు సౌకర్యం లేక యా లాల మండలం దేవనూరు నుంచి 10 కిలోమీటర్లు తిరిగి మండల కేం ద్రానికి రావాల్సిందే.
కాకరవాణి వాగుపై వంతెన నిర్మించి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని దశాబ్దాలుగా ప్రజలు కోరుతున్నా నెరవేరలేదు. రెండేళ్ల క్రితం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చొరవ తీసుకుని బొంరాస్పేట నుంచి మహాంతిపూర్ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించ డానికి రూ.3 కోట్లు మంజూరు చేయించారు. టెండరు పూర్తయినా కాంట్రాక్టరు పనులు ప్రారంభించకపోవడంతో సమస్య అలాగే ఉండిపోయింది. కొడంగల్ నుంచి రేవంత్రెడ్డి గెలుపొంది ముఖ్య మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో మహాంతిపూర్ గ్రామ ప్రజల దశాబ్దాల కల నెరవేరుతున్నది. గ్రామానికి బీటీ రోడ్డుతో పాటు కాకరవాణి వాగుపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.23.86 కోట్లను మంజూరు చేసింది.
బొంరాస్పేట మీదుగా జానకంపల్లి, మహాంతిపూర్, యాలాల మండలం గుబ్బడితండా, దేవనూరు మీదుగా నాగసముందర్ గ్రామం వరకు 9 కిలోమీటర్ల దూరం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉన్నది. ఈ రోడ్డు, వంతెన నిర్మాణ పనులు పూర్తయితే మహాంతిపూర్, జానకంపల్లి గ్రామాల ప్రజలకు మండల కేంద్రానికి రావడానికి, తాండూరు వెళ్లడానికి సౌకర్యం కలుగుతుంది. అంతేకాకుండా వర్షాకాలంలో వాగు కష్టాలు తీరనున్నాయి. బీటీ రోడ్డు, వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.