బొంరాస్పేట, ఫిబ్రవరి 28 : వికారాబాద్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి సమస్యలతో వచ్చే వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునే ప్రజలను చైతన్యం చేస్తున్నారు. మంగళవారం జిల్లాలో 5409 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 865 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేసి 843 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇప్పటి వరకు 165 గ్రామాలు, 39 వార్డుల్లో ఈ శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
రంగారెడ్డిజిల్లాలో 15,919 మందికి కంటి పరీక్షలు
షాబాద్ : రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మంగళవారం 80 బృందాల ద్వారా కంటి వెలుగు క్యాంపులు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 15,919 మందికి కంటి పరీక్షలు చేశారు. జిల్లాలో కొనసాగుతున్న క్యాంపులను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారితో పాటు, డివిజన్ స్థాయి వైద్యాధికారులు సందర్శించి వివరాలు తెలుసుకుంటున్నారు.
80 బృందాల ద్వారా..
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 15,919 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,606 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,425 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.