షాబాద్, మార్చి 16 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గురువారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 14,797 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,286 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 991 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపులను జిల్లా, డివిజన్ స్థాయి, ఆరోగ్యశాఖ అధికారులు, మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి కంటి పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా వైద్యసిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను వైద్యసిబ్బంది ఎప్పటికప్పుడూ ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
బొంరాస్పేట : గురువారం జిల్లాలో 4542 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 671 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 711 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 233 గ్రామాలు, 50 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం గ్రామీణ ప్రాంత పేదలకు ఎంతో భరోసా ఇస్తున్నది. ఏ అనారోగ్యం కలిగినా దవాఖానాకు వెళ్లవచ్చు. కంటికి ఏవైన ఇబ్బంది జరిగితే చూపించుకునేందుకు దగ్గర్లో కంటి దవాఖానలు లేవు. కండ్లు కనిపించకున్నా, మసకబారినా డాక్టర్లు అందుబాటులో లేక సర్దుకుపోతున్నాం. కంటి వెలుగులో పరీక్ష చేసుకున్న తర్వాత కంటి సమస్య ఉందని తెలిసింది. అద్దాలివ్వడంతో దగ్గరి చూపు బాగా కనిపిస్తున్నది.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగుతో పేదలు వేరే చోటుకు వెళ్లకుండా ఊర్లోనే పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇవ్వడం ప్రభుత్వానికి పేదలపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది వరకు నేను ఎక్కడా చూడలేదు. మునుపు కంటి పరీక్షలు చేసుకోవాలంటే దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. నాకు పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిండ్రు.