బొంరాస్పేట, మే 31 : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు(సీఆర్టీ) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపు వంటి ఆమోదయోగ్యమైన, హర్షించదగ్గ నిర్ణయాలు తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం సీఆర్టీలకు కూడా ఏడాది పూర్తి వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల 29వ తేదీన జీవో నెంబరు 184 జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలోని ఐదు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న 29 సీఆర్టీలకు ప్రయోజనం కలుగనున్నది.
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు కాంట్రాక్టు రెసిడిన్షియల్ టీచర్లు(సీఆర్టీ) పని చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎస్జీటీలకు నెలకు రూ.4 వేలు, స్కూల్ అసిస్టెంట్లకు రూ.5 వేలు వేతనం అందించేవారు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచారు. సీఆర్టీల వేతనం కూడా పెంచి నెలకు ఎస్జీటీలకు రూ.21,255, స్కూల్ అసిస్టెంట్లకు రూ.28,977 అందజేస్తున్నారు. ఒక విద్యా సంవత్సరంలో పదిన్నర నెలలు మాత్రమే వీరికి వేతనం అందించే వారు. వేసవి సెలవుల్లో వేతనం ఇచ్చేవారు కాదు. వేసవి సెలవుల్లో కూడా తమకు వేతనం అందజేయాలని సీఆర్టీలు గత కొన్నాండ్ల నుంచి ప్రభుత్వానికి విన్నవిస్తూ వచ్చారు. వీరి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం విద్యా సంవత్సరం పదిన్నర నెలలు కాకుండా 12 నెలల వేతనం అందజేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం 2022-2023 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
జిల్లాలో 29 మంది సీఆర్టీలకు ప్రయోజనం..
వికారాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఐదు ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. కులకచర్ల మండలం కొత్తపల్లి, మర్పల్లిలో బాలుర ఆశ్రమ పాఠశాలలు, కులకచర్ల మండలం రాంపూర్, బండవెల్కిచెర్ల, బొంరాస్పేట మండలం బొట్లవానితండాలో బాలికల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో రెగ్యులర్ టీచర్లతో పాటు 29 మంది సీఆర్టీలు పని చేస్తున్నారు. వీరిలో 12 మంది ఎస్జీటీలు, 17 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గత విద్యా సంవత్సరం(2022-2023) నుంచి వీరందరికీ 12 నెలల వేతనం అందనున్నది. ప్రభుత్వ నిర్ణయంపై సీఆర్టీలు హర్షం వ్యక్తం చేశారు. తాము ఎన్నో ఏండ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నామని, రెగ్యులరైజ్ చేయాలని సీఆర్టీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
సీఆర్టీలకు పదిన్నర నెలల వేతనం కాకుండా ఏడాది కాలానికి పూర్తి వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. మా విజ్ఞప్తులకు సానుకూలంగా ప్రభుత్వం స్పందించి సముచిత నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉన్నది. సీఆర్టీలు గత 21 ఏండ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నాం. మా ఉద్యోగాలనూ రెగ్యులరైజ్ చేస్తే సీఎం కేసీఆర్కు, ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– శరణప్ప, సీఆర్టీ, బొట్లవానితండా ఆశ్రమ పాఠశాల, బొంరాస్పేట