రంగారెడ్డి, ఏప్రిల్ 2 : (నమస్తే తెలంగాణ) : పట్టుదల ఉంటే సాధించలేనిదనేదేదీ లేదు.. శ్రద్ధగా చదివి ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాస్తే తప్పక విజయం సాధిస్తారని విద్యా నిపుణులు తెలుపుతున్నారు. నేటి నుంచి 13వ తేదీ వరకు జరుగనున్న పదో తరగతి పరీక్షలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లాలో 226, వికారాబాద్ జిల్లాలో 74 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, రెండు జిల్లాల్లో కలిపి 63075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 25,550 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వారు కాగా, 37,525 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు చెందినవారు ఉన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిపరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు పారదర్శకంగా జరిగేలా రంగారెడ్డి జిల్లాలో 10 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, వికారాబాద్ జిల్లాలో నాలుగు ఫ్లయింగ్ స్కాడ్లు, సిట్టింగ్ స్కాడ్లు, ఇన్విజిలెటర్లు, ఎస్సెస్సీ బోర్డు బృందాలు పరీక్షలను పర్యవేక్షించనున్నారు. www.bsetelangana.gov.in <http://www.bsetelangana.gov.in> వెబ్సైట్ నుంచి కూడా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని విద్యా శాఖ కల్పించింది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనున్నది.
పదో తరగతి విద్యార్థులకు నేటి (ఏప్రిల్ 3) నుంచి వార్షిక పరీక్షలు షురూ కానున్నాయి. పరీక్షలకు రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసింది. ఈ నెల 3 నుంచి 13 వరకు జరుగనున్న పరీక్షలకు విద్యార్థులంతా సన్నద్ధమయ్యారు. కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో డీఈవో సుశీందర్రావు పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కాగా.. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ -1, కాంపోజిట్ – 2, ఇంకా సైన్స్ పరీక్షలకు సంబంధించి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు జరుగనున్నాయి. జిల్లాలో 49,751 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ఎస్సెస్సీ బోర్డు పరీక్షలకు జిల్లావ్యాప్తంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పాఠశాలలకు హాల్ టికెట్లు అందించారు. www.bsetelangana.gov.in వెబ్సైట్ నుంచి కూడా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు సరిపడా బెంచీలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లకు డ్యూటీలు కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
226 కేంద్రాల్లో 49,751 మంది విద్యార్థులు
జిల్లావ్యాప్తంగా 226 పరీక్షా కేంద్రాల్లో 49,751 మంది విద్యార్థులు సోమవారం నుంచి పది పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 14,716 మంది విద్యార్థులు హాజరవుతుండగా.. వారిలో 6,955 మంది బాలురు, 7,761 మంది బాలికలు ఉన్నారు. మిగతావారంతా (35,035 మంది) ప్రైవేట్ పాఠశాలల నుంచి హాజరవుతున్నారు. పరీక్షలన్నీ సీసీ కెమెరాల నిఘాలో జరుగనున్నాయి. 10 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు పరీక్షల పకడ్బందీ నిర్వహణకు తోడ్పడనున్నాయి. ఎస్సెస్సీ బోర్డు బృందాలు కూడా ఈ పరీక్షలపై ఒక కన్ను వేయనున్నాయి.
గంట ముందే పరీక్షా కేంద్రాలకు..
ఒక గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ఆహ్వానించబోమని అధికారులు కరాఖండిగా చెబుతూ విద్యార్థులను హెచ్చరిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేసి ఒక ఏఎన్ఎంను అందుబాటులో ఉంచుతూ వైద్యాధికారులు, ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాగునీరు, ఫ్యాన్స్, టాయిలెట్స్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చూసుకుంటున్నారు. విద్యార్థులు తమ వెంట పారదర్శక నీటి సీసాలు, శానిటైజర్లు, మాస్క్లు తీసుకురావొచ్చన్నారు. క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడంలేదు. పరీక్ష పూర్తయ్యేవరకు విద్యార్థులు హాల్లోనే ఉండాలని అధికారులు తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయండి
విద్యార్థులు ఎలాంటి భయానికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో నిర్భయంగా పరీక్షలు రాయాలి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుపర్చుతున్నాం. తగిన పోలీసు బందోబస్తుకు ఇప్పటికే ఆదేశాలిచ్చాం. పరీక్షా కేంద్రాల వద్ద ఒక ఏఎన్ఎం, ఆశ వర్కర్లను అందుబాటులో ఉంచుతున్నాం. పరీక్షా సమయాలకు అనుకూలంగా అన్ని రూట్లలో విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశాం. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, సరిపడా ఫర్నిచర్ ఉండేలా ఏర్పాట్లు చేశాం. పరీక్షలు కొనసాగే సమయాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం తలెత్తకుండా ట్రాన్స్కో అధికారులతో సంప్రదించి జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా ఇన్విజిలేటర్లతో పాటు 10 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించాం. పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తున్నాం. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు జిల్లాస్థాయిలో కంట్రోల్ రూం (నం.90006 46899) 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.
– సుశీందర్రావు, జిల్లా విద్యా శాఖ అధికారి