షాబాద్, మార్చి 18 : పదో తరగతి పరీక్ష సజావుగా జరిగింది. మొదటి రోజు సోమవారం రంగారెడ్డిజిల్లాలో మొత్తం 50,935 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 50,790 మంది విద్యార్థులు హాజరయ్యారు. 145 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు సంబంధిత విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 239 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రైవేటు విద్యార్థుల కోసం మరో 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించారు.
ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన వారికి కూడా పరీక్ష రాసేందుకు అనుమతినిచ్చారు. మొదటి రోజు కావడంతో గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొని ఏ రూంలో తమ నంబర్లు వేశారో చూసుకున్నారు. ఉపాధ్యాయులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి విద్యార్థులను లోపలికి పంపించారు. జిల్లాలోని ఆయా పరీక్షా కేంద్రాలను డీఈవో సుశీందర్రావు సందర్శించారు. ఫ్లయింగ్ స్కాడ్తో పాటు అసిస్టెంట్ కమిషనర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
జిల్లా విద్యాశాఖ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పదో తరగతి పరీక్షలు నిర్వహించింది. ప్రతి పరీక్షా కేంద్రానికీ ఓ చీఫ్ సూపరింటెండెంట్, ఓ డిపార్ట్మెంటల్ అధికారిని, జిల్లావ్యాప్తంగా 2,450 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి కేంద్రానికీ ఓ సిట్టింగ్ స్కాడ్ను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 144 సెక్షన్ను విధించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగే సమయంలో సెంటర్లకు సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసివేయించారు. పరీక్షల్లో కాపీయింగ్కు పాల్పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు.
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 80 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీటితో పాటు ఇతర సౌకర్యాలను కల్పించారు. జిల్లాలో మొత్తం విద్యార్థులు 13,410 మంది విద్యార్థులకుగాను 13,353 మంది హాజరు కాగా, 57 మంది గైర్హాజరు అయ్యారు. ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని 08416-235245ను సంప్రదించవచ్చు.