వికారాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకు జిల్లా విద్యాశాఖ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నది. ఈనెల 18 నుంచే టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ నుంచే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సిలబస్ను జనవరిలోనే పూర్తిచేసి అప్పటి నుంచే రివిజన్ చేస్తున్నారు. కాగా గతేడాది 59.82 శాతం మాత్రమే ఉత్తీర్ణులుకాగా, ఈ ఏడాది మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు.
అంతేకాకుండా ఉత్తీర్ణతలో వెనుకబడిన ప్రభుత్వ బడులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటన నేపథ్యంలో ఈ ఏడాది పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టెన్త్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘా నీడలో జరుగనున్నాయి. ఈ ఏడా ది 80 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది.
ఈ ఏడాది టెన్త్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ నుంచే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నా రు. జిల్లాలోని కొన్ని బడుల్లో నవంబర్ నుంచే ప్రారంభంకాగా.. మిగిలిన అన్ని స్కూళ్లలో డిసెంబర్ నుంచి షురూ అయ్యాయి. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.00 నుంచి 5.30 గంటల వరకు కొనసాగుతు న్నాయి. ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టుపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యా ర్థుల కు ఉన్న సందేహాలను సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుడు నివృత్తి చేస్తున్నారు.
అంతేకాకుండా ప్రతినెలా స్పెషల్ టెస్టులను నిర్వహిస్తూ వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం టెన్త్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు 13,412 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారిలో బాలికలు-6477 మంది, బాలురు 6883 మంది ఉ న్నారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి 2,848 మంది.. మిగతా 10,564 మంది విద్యార్థులు ప్రభుత్వ, ఎయిడెడ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ ఆశ్రమ స్కూళ్లతోపాటు కేజీబీవీ, జడ్పీ తదితర పాఠశాలల నుంచి హాజరు కానున్నారు. కాగా జిల్లాలో పరీక్షల నిర్వహణకు 80 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 1073 ప్రభుత్వ పాఠశాలలుండగా, 162 జడ్పీహెచ్ఎస్లున్నాయి.
టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు జరుగకుండా అధికారులు అప్రమత్తమ య్యారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు అదనంగా ఇన్విజిలేటర్లనూ నియమిస్తున్నారు. జిల్లాలోని 80 పరీక్షా కేంద్రాల్లో 700 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అంతేకాకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వ హించేందుకు ఐదు ఫ్లయింగ్ స్కాడ్, 80 సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలో పదోతరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 80 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు మాస్ కాపీయింగ్కు విద్యార్థులు పాల్ప డకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో విద్యార్థులు 80 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించేందుకు డిసెంబర్ నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించి.. ప్రతినెలా స్పెషల్ టెస్టులు రాయిస్తూ సన్నద్ధం చేస్తున్నాం.
– రేణుకాదేవి, వికారాబాద్ డీఈవో