ఆది నుంచి గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ వారికి మరింత మేలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే శుక్రవారం శాసనసభ వేదికగా గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించడం, పోడు భూముల పట్టాలపై కీలక ప్రకటనలు చేశారు. ఇప్పటికే పోడుభూముల సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటుండగా.. ఈ నెలాఖరులోగా అర్హులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా పట్టాలిచ్చిన భూములకు రైతుబంధు, విద్యుత్తు, సాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు.
వికారాబాద్ జిల్లాలో 22,485 ఎకరాల్లో పోడు భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పోడు భూముల పట్టాల కోసం 114 గ్రామ పంచాయతీల్లో 9973 దరఖాస్తులు రాగా.. అర్హులను తేల్చే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. అలాగే రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 600 ఎకరాల్లో పోడు భూములున్నట్లు అటవీ, రెవెన్యూ అధికారులు గుర్తించారు. గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచడంపై ఇప్పటికే తీర్మానం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. శుక్రవారం మరోసారి తీర్మానించి కేంద్రానికి పంపింది. గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గిరిజనులు సంబురాలు చేసుకుంటున్నారు.
-ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 10
వికారాబాద్, ఫిబ్రవరి 10, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల సంక్షేమం నిమిత్తం అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం, సంబంధిత గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, ఎక్కడాలేని విధంగా రిజర్వేషన్లు కల్పించడం తదితర కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్ర శాసనసభలో శుక్రవారం రెండు కీలక అంశాలపై ప్రభుత్వం తీర్మానాలు చేసింది. పోడు భూములతోపాటు గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వం తీర్మానించింది. అయితే ఈనెలాఖరులోగా పోడుదారులకు పట్టాల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాకుండా పట్టాలను పంపిణీ చేసిన అనంతరం సంబంధిత భూములకు రైతుబంధు, విద్యుత్తు, సాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు.
పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పట్టాలిచ్చేందుకుగాను ప్రభుత్వం నిర్ణయించి, ఇప్పటికే సర్వే ప్రక్రియను కూడా పూర్తి చేసింది. అయితే సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తామని, కానీ తదనంతరం అటవీ భూములు కబ్జా కాకుండా కాపాడాల్సిన బాధ్యత పట్టాలు పొందిన గిరిజనులదేనని ప్రభుత్వం పేర్కొన్నది. అంతేకాకుండా ఇకపై చెట్లు నరకమని తీర్మానం చేస్తేనే భూములు పంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే జిల్లాలో పోడు భూములకు సంబంధించి 114 గ్రామ పంచాయతీల్లో 9973 దరఖాస్తులు రాగా, 22,485 ఎకరాల్లో పోడు భూములను సాగు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. జిల్లాలో పోడు భూములకు సంబంధించి సర్వే పూర్తి కాగా, గ్రామ, మండల, డివిజినల్ స్థాయి కమిటీ సమావేశాలు పూర్తి కాగా, జిల్లా స్థాయి కమిటీలో ఎంతమంది పోడు భూముల పట్టాలను పొందేందుకు అర్హులనేది తేల్చనున్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను పెంచడంపై ఇప్పటికే తీర్మానం చేసిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది.
రంగారెడ్డి జిల్లా గిరిజనుల్లో ఆనందం..
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 10 : జిల్లాలో ఎన్నో ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని పోడుభూముల పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోడుభూముల సమస్యలు పరిష్కరించి వెంటనే పట్టాలు కూడా అందజేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 600ఎకరాల పోడు భూములున్నట్లు అటవీ, రెవెన్యూ అధికారులు గుర్తించారు. గుర్తించిన ఆరువందల ఎకరాలపై అర్హులైన వారందరికీ త్వరలోనే పట్టాలు అందనున్నాయి. ఇప్పటికే రెవెన్యూ, అటవీశాఖ అధికారులు డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి పోడుభూములు సాగు చేసుకుంటున్న రైతుల వివరాలను కూడా గుర్తించారు. దీంతో ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న పోడు భూముల సమస్యకు ప్రభుత్వం పరిష్కారానికి హామీ ఇవ్వడంతో పోడు భూముల రైతుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
గిరిజన రిజర్వేషన్లపై సర్వత్రా హర్షం..
పోడు భూముల పట్టాలు, గిరిజన రిజర్వేషన్లను అమలులోకి తెస్తామని సీఎం ప్రకటించడంతో రంగారెడ్డి జిల్లాలోని గిరిజనులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మంచాల, యాచారం, తలకొండపల్లి, ఆమనగల్లు, మాడ్గుల తదితర మండలాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడంతో గిరిజనులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గిరిజనులకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
రిజర్వేషన్లు కల్పిస్తామనడం ఆనందంగా ఉన్నది..
గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం ఆనందంగా ఉన్నది. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రిజర్వేషన్ కల్పిస్తే వారి పిల్లలు బాగుపడుతారు. దీని వల్ల గిరిజన యువకులు, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది. గిరిజనుల స్వప్నాన్ని సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– రాంచందర్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కులకచర్ల
పోడు రైతులకు శుభవార్త చెప్పిన సీఎంకు కృతజ్ఞతలు..
పోడుభూముల రైతులకు న్యాయం చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం అభినందనీయం. కులకచర్ల మండలంలో చాలా మంది గిరిజనులు పోడు భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారు. ఏండ్ల తరబడి వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు న్యాయం జరుగనున్నది.
– రాంలాల్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు, కులకచర్ల
గిరిజనులకు రిజర్వేషన్ పెంపు సంతోషం..
తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడం చాలా సంతోషంగా ఉన్నది. దీంతో గిరిజనుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగనున్నది. విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేన్లు అమలైతే గిరిజన నిరుద్యోగులకు మేలు జరుగడమే కాకుండా ఉద్యోగులకు ప్రమోషన్లలో ప్రయోజనం చేకూరనున్నది. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– విఠల్నాయక్, గిరిజన సంఘం ప్రతినిధి, తాండూరు
గిరిజనులకు మరో శుభ పరిణామం..
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో గిరిజనులకు మరోసారి శుభ పరిణామం కలిగింది. తండాలను పంచాయతీలుగా చేసి అభివృద్ధికి తోడ్పాటును అందించారు. మళ్లీ ఇప్పుడు అసెంబ్లీలో గిరిజనుల రిజర్వేషన్పై తీర్మానం చేపట్టడం చాలా సంతోషంగా ఉన్నది. గిరిజనులు అన్నింటా వెనుకబడి ఉన్నారు. రిజర్వేషన్ను పెంచనుండడం సంతోషంగా ఉన్నది.
– దత్తునాయక్, పలుగురాళ్లతండా, కొడంగల్
సీఎం కేసీఆర్కకు ప్రత్యేక ధన్యవాదాలు..
ఏండ్ల కాలంగా పోడు భూముల్లో వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాం. ముఖ్యమంత్రి పోడు రైతులకు అండగా నిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా సంవత్సరాలుగా పోడు భూమిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. అసెంబ్లీలో పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటన చేయడం హర్షణీయం. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– శేన్యానాయక్, మైసమ్మతండా, చిట్లపల్లి గ్రామం, కొడంగల్
గిరిజనులమంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
గిరిజనులంతా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు. గత ప్రభుత్వాలు, గిరిజనులను పట్టించుకున్న పాపానా పోలేదు. సీఎం కేసీఆర్, దళితబంధు మాదిరిగానే గిరిజన బంధు అమలు చేస్తామని చెప్పడం సంతోషంగా ఉన్నది. పోడు భూముల పంపిణీ ప్రారంభించి, రైతుబంధు ఇస్తామని ప్రకటించడం హర్షణీయం
– బీమ్లానాయక్, మద్దూర్(షాబాద్)
పోడుభూముల సమస్యల పరిష్కారం..
ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనుల పోడుభూముల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం సంతోషంగా ఉన్నది. సాగుచేసుకుంటున్న పోడుభూములకు ఇప్పటి వరకు పట్టాలులేవు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి, రైతుబంధు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– ఆంగోతు ప్రవీణ్నాయక్, గిరిజన సంఘం నాయకుడు
గిరిజనుల అభివృద్ధికి ఎంతో దోహదం..
రిజర్వేషన్లు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఎంతో ఆనందం ఉన్నది. రిజర్వేషన్ల పెంపు గిరిజనుల అభివృద్ధికి ఎంతో దోహదపడనున్నది. విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు సరైన ప్రాధాన్యత లభించనున్నది. గిరిజనుల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమైనది. గిరిజనుల బతుకులను బాగు చేసే సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. సీఎం కేసీఆర్, దళితబంధు మాదిరిగానే గిరిజన బంధు అమలు చేస్తామని చెప్పడం సంతోషంగా ఉన్నది
– జాటోతు నర్మద, మంచాల ఎంపీపీ