ఆసరా పింఛన్లను అందజేస్తూ సీఎం కేసీఆర్ లబ్ధిదారులకు కొండంత అండగా నిలుస్తున్నారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత రూ.200 ఉన్న పింఛన్ను రూ.2016కు, రూ.500 ఉన్న పింఛన్ను రూ.3016కు పెంచిన సీఎం కేసీఆర్ పింఛన్దారులకు భరోసాను కల్పించారు. వికారాబాద్ జిల్లాలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా రూ.26 కోట్ల ఆసరా పింఛన్లను అందజేస్తూ తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రాష్ట్రం సిద్ధించక ముందు గత ప్రభుత్వాలు జిల్లాకు నెలకు రూ.2 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవి. చాలీచాలని డబ్బులతో ఏమి కొనలేక, తినలేక అవస్థలు పడేవారు. ప్రస్తుతం వచ్చే పింఛన్తో నెలంతా సంతోషంగా గడుపుతుండడం విశేషం. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 1.02 లక్షల పింఛన్దారులు ఉండగా, ఇప్పటివరకు రూ.1000 కోట్లకుపైనే ప్రభుత్వం ఖర్చు చేసింది. సీఎం కేసీఆర్ పెద్దకొడుకులా నెలనెలా పింఛన్లను అందజేస్తూ ఆదుకుంటుండడంతో పింఛన్దారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
వికారాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : సొంతవారు దూరమై.. వృద్ధ్యాప్యంలో ఆదరణ కరువైన ఎంతోమంది పండుటాకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే పింఛన్ పైసలే వారికి దిక్కవుతున్నాయి. అందరూ ఉండి కూడా కొంతమంది అనాథలవుతున్నారు. మరికొంతమంది ఎవరూ లేక అనాథలుగా మారుతున్నారు. ఇలాంటి ఎంతోమందికి ప్రతి నెలా ప్రభుత్వం ఇస్తున్న రూ.2016 వృద్ధాప్య పింఛనే వారికి జీవనాధారమైంది. దివ్యాంగులకు అందిస్తున్న రూ.3016 వారికి అండగా నిలుస్తున్నది. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన అరకొర పింఛన్లకు స్వస్తి పలికి మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.200ల పింఛన్ను రూ.1000లకు, రూ.500ల పింఛన్ను రూ.1500లకు పెంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. రెండోసారి ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టడంతో రూ.1000 పింఛన్ను రూ.2016లకు, రూ.1500 పింఛన్ను రూ.3016లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే. ఆసరా పింఛన్ల పెంపుతోపాటు పింఛన్ల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గిస్తామని ఇచ్చిన హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. పింఛన్ల నిమిత్తం గత ప్రభుత్వాలు నెలకు కేవలం రూ.2 కోట్లు ఖర్చు చేయగా.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మొదట నెలకు రూ.12కోట్ల మేర పింఛన్ల నిమిత్తం ఖర్చు చేసింది. తదనంతరం పింఛన్ డబ్బులు రెట్టింపు కావడంతోపాటు వయోపరిమితి తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.26 కోట్ల మేర ఖర్చు చేస్తున్నది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఆసరా పింఛన్దారులు 1,02,780 మంది ఉండగా వృద్ధాప్య పింఛన్దారులు-35250, వితంతువులు-49228, దివ్యాంగులు-12945, చేనేత కార్మికులు-168, కల్లుగీత కార్మికులు-468, బీడీ కార్మికులు 41 మంది, ఒంటరి మహిళలు 4680 మంది పింఛన్దారులు ఉన్నారు.
ఆసరా పథకం ఎంతో మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులందరికీ అండగా నిలుస్తున్నది. ఆసరా పింఛన్ల రెట్టింపుతో ప్రతి నెల రూ.26 కోట్ల మేర పింఛన్ల నిమిత్తం ఖర్చు చేస్తున్నది. 2019 నుంచి దివ్యాంగుల పింఛన్లను రూ.3016లకు, ఇతరుల పింఛన్లను రూ.2016లకు పెంచుతూ అమల్లోకి తీసుకువచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో పింఛన్ల నిమిత్తం రూ.875 కోట్లను ఖర్చు చేసింది. అంతకు ముందు రూ.200 కోట్ల వరకు పింఛన్ల నిమిత్తం ప్రభుత్వం వెచ్చించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1,05,495 మంది పింఛన్దారులకు రూ.230.94 కోట్లు, 2020-21లో 1,01,579 పింఛన్దారులకు రూ.253.79 కోట్లు, 2021-22లో 96,375 మంది పింఛన్దారులకు రూ.241.18 కోట్లు, 2022-23 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.150.06 కోట్ల నిధులను ఆసరా పింఛన్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.
సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు ప్రతి నెలా పింఛన్ డబ్బులను అందిస్తూ ఆదుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆసరా పింఛన్ పథకంలో భాగంగా నాకు కూడా ప్రతి నెలా డబ్బులు వస్తున్నాయి. దీంతో నాకు అవసరమమ్యే మందులు, ఇతర అవసరాలను తీర్చుకుంటున్నాను. సీఎం కేసీఆర్ మేలు జీవితంలో మరువలేనిది. కేసీఆర్కు మాలాంటి నిరుపేదలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు.
– తట్టేపల్లి చంద్రమ్మ, బండపల్లి, పెద్దేముల్ మండలం
ముసలోళ్లకు కేసీఆర్ సర్కారు ఆసరా పింఛన్ అందించి ఆదుకుంటున్నది. ప్రతి నెలా నాకు రూ.2వేల పింఛన్ వస్తున్నది. ఈ పింఛనే నాకు ఆధారం. ఒక కొడుకు చనిపోగా.. ఇంకో కొడుకు అనారోగ్యంతో మంచంపై ఉన్నాడు. ఆసరా పింఛనే ఆదుకుంటున్నది. తెలంగాణ రాకముందు నెలకు రూ.200 పింఛను ఇచ్చేవారు. అవి ఏ మూలకు సరిపోయేవి కావు. ముసలివాళ్ల కష్టాలు తెలిసి కేసీఆర్ ఆసరా పింఛన్లు పెంచి అందిస్తున్నాడు. వచ్చే పింఛన్తో ఎవరిపై ఆధారపడకుండా బతుకుతున్నా. ఇంత సాయం చేసిన సర్కారును నేను ఎప్పుడూ చూడలేదు. సీఎం సారు సల్లంగా ఉండాలి.
సీఎం కేసీఆర్ దివ్యాంగుల పాలిట దేవుడు. గతంలో మాకు పింఛన్ చాలా తక్కువగా వస్తుండే. ఏ పనీ చేయలేక.. ఖర్చుల కోసం డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దివ్యాంగులకు రూ.3 వేల పింఛన్ అందించి ఆదుకుంటున్నారు. ఇప్పుడు ఎవరిపై ఆధారపడకుండా గౌరవంతో బతుకుతున్నా. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి సహాయం చేయలేదు. ప్రతినెలా వస్తున్న పింఛన్తో నా అవసరాలు తీర్చుకుంటున్నా. ఆసరా పింఛన్తో మా బతుకులు మారాయి.
– లాక మల్లప్ప, చౌదర్పల్లి, బొంరాస్పేట మండల