రంగారెడ్డి, జనవరి 17,(నమస్తే తెలంగాణ): ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఆరోగ్య తెలంగాణ కోసం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. చూపు మందగించిన వారికి రెండో విడుత ‘కంటి వెలుగు’ను అందించేందుకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతున్నది. నేడు ఖమ్మంలో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా, రేపు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మంత్రి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట, రంగారెడ్డి జిల్లాలోని మీర్పేటలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, మిగతా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించనుండగా, ఉమ్మడి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వికారాబాద్ జిల్లాలో 42, రంగారెడ్డి జిల్లాలో 80 వైద్య, ఆరోగ్య బృందాలు సేవలందించనున్నాయి. నిత్యం పల్లెల్లో 300 మందికి, పట్టణాల్లో 350 మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమున్నవారికి శస్త్రచికిత్సలు చేసి, మందులతో పాటు కండ్లద్దాలను ఇవ్వనున్నారు. ఇందుకు వికారాబాద్ జిల్లాలో 39,767, రంగారెడ్డి జిల్లాలో 99,382 రీడింగ్ కంటి అద్దాలను సిద్ధంగా ఉంచారు. పేద ప్రజలు కంటి వెలుగును సద్వినియోగం చేసుకునేలా ఉమ్మడి జిల్లా యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేస్తున్నది.
చూపు మందగించిన వారికి.. దృష్టి లోపం, అంధకారంలో కూరుకుపోయిన ఎంతోమంది జీవితాల్లో వెలుగులు ప్రసరించేలా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. 18 ఏండ్లు నిం డిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు, మందులతోపాటు కంటి ఆపరేషన్లు నిర్వహించేందుకు రెండో విడుత ‘కంటి వెలుగు’కు శ్రీకారం చు ట్టింది. ఈ నెల 19న మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేటలో మంత్రి సబితారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గురువా రం నుంచి జరుగనున్న కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే అధికారులు 80 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో నిర్వహించిన మొదటి విడుత సక్సెస్ అయ్యింది. అవసరమైన వేలాది మందికి ప్రభుత్వం చికిత్సలు చేయించడంతోపాటు కంటి అద్దాలు, మందులను ఉచితంగా పంపిణీ చేసింది.
జిల్లాలో 80 బృందాల ఏర్పాటు
రెండోవిడుత ‘కంటి వెలుగు’ నిర్వహణ నిమిత్తం అధికారులు జిల్లాలో 80 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్, డీఈవో, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు/ముగ్గురు ఆశ వర్కర్లు ఉండనున్నారు. ఇలా చూసుకుంటే ఒక్కో బృందంలో 8 నుంచి 9 మంది సభ్యు లు పని చేయనున్నారు. కాగా, జిల్లాలో ఏర్పాటు చేసిన 80 బృందాల్లో 640 నుంచి 720 మంది వైద్యారోగ్య నిపుణులు పని చేసేందుకు సిద్ధమయ్యారు. డీఎంహెచ్వో ఆధ్వర్యం లో 80 బృందాలు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పని చేయనున్నాయి. క్యాంపులకు వచ్చే వారు ఆధార్, మొబైల్ నంబర్లను తమ వెంట తీసుకుని రావాలని అధికారులు సూచిస్తున్నారు. వాటి ద్వారా వెబ్ పోర్టల్లో వివరాలను పొందుపర్చేందుకు దోహదపడుతాయన్నారు.
అన్ని పీహెచ్సీలకు చేరిన సామగ్రి..
జిల్లాలోని 35 పీహెచ్సీలు, 21 యూపీహెచ్సీలు, 2 పీపీ యూనిట్లు, 2 సీహెచ్సీలకు ఇప్పటికే ‘కంటి వెలుగు’కు సంబంధించిన సామగ్రి చేరింది. ఐఈసీ (ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ క మ్యూనికేషన్) సామగ్రి, ఏఆర్ఎంలు, 99,382 రీడింగ్ గ్లాసెస్, క్యాంపు లాజిస్టిక్స్ సామగ్రి అంతా పీహెచ్సీలకు చేరింది. 80 శిబిరాల ప్రారంభోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలను ఉచితంగా అందించనున్నారు.
అంధత్వ నివారణకు కృషి
అంధత్వ నివారణతోపాటు ప్రతి ఒక్కరికీ కంటి సమస్యలకు సంబంధించిన వ్యాధులను నిర్మూలించి, సంపూర్ణంగా చూపును ఇవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడుత విజయవంతం కాగా.. రెం డో విడుత ఈ నెల 19 నుంచి జిల్లాలో ప్రారంభం కానున్నది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి మందులు, కంటి అద్దాలను ఉచితంగా అందించనున్నారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించనున్నాం. – వెంకటేశ్వరరావు,
డీఎంహెచ్వో, రంగారెడ్డి
కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి
గతంలో కంటి సమస్యతో ఇబ్బందిపడ్డా. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన గతంలో ‘కంటి వెలుగు’లో పరీక్షలు చేయించుకోగా వైద్యులు దృష్టి లోపం ఉందని గుర్తించి ఉచి తంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఎలాంటి సమస్య లేదు. కండ్లు బాగా కనిపిస్తున్నాయి. -వగ్గు ఈరమ్మ , నవ చైతన్య కాలనీ ,ఆమనగల్లు
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
కంటి వెలుగు కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ వెలుగును ప్రసాదించారు. మొదటి విడుతలో కంటి పరీక్షలు చేయించుకోగా వైద్యులు శస్త్ర చికిత్స అవసరమని చెప్పారు. దీంతో ప్రభుత్వ దవాఖానలో శస్త్ర చికిత్స చేయించుకోగా ప్రస్తుతం కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి. వెలుగును ప్రసాదించిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. -పద్మమ్మ, బషీరాబాద్
ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
‘కంటి వెలుగు’ పేదలకు వరంలాంటింది. మొదటి విడుతలో భాగంగా నేను కంటి పరీక్షలు చేయించుకుని అద్దాలను తీసుకున్నా. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తులసీరాం, పటేల్చెరువుతండా, కులకచర్ల
మసక బారిన కంటికి చూపొచ్చింది
ఆర్థిక స్థోమత సహకరించక కంటికి శస్త్ర చికిత్స చేయించుకోలేకపోయా. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘కంటి వెలుగు’లో అధికారులు పరీక్షలు చేసి ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహించి అద్దాలను అందజేశారు. ప్రస్తుతం కండ్లు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు ధాన్యవాదాలు. -మల్గేరి హన్మంతు, కిష్టాపూర్, దోమ మండలం
కంటి అద్దాల పంపిణీ హర్షణీయం
‘కంటి వెలుగు’ నిరుపేదలకు వరంగా మారింది. కంటిచూపు లేక వృద్ధ్ధులం చాలా
ఇబ్బంది పడేది. కంటి పరీక్షలు, అద్దాల కోసం నగరాలకెళ్తే చాలా డబ్బులు ఖర్చు అయ్యేవి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లోనే క్యాంపులు ఏర్పాటు చేసి ఉచి తంగా పరీక్షలు నిర్వహించడంతోపాటు కంటి అద్దాలను పంపిణీ చేయడం సంతోషకరం. -బాలయ్య, సోమన్గుర్తి గ్రామం, పూడూరు మండలం
రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేశారు
కండ్లు సరిగ్గా కనిపించక చాలా రోజులుగా ఇబ్బందిపడ్డా. మొదటి విడుత కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మా గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాం పులో వైద్యులు కంటి పరీక్షలు చేయగా.. శస్త్ర చికిత్స అవసరం చెప్పి.. ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేసి అద్దాలు ఇచ్చారు. ప్రస్తుతం కండ్లు బాగా కనిపిస్తున్నాయి. – అంజమ్మ, నందిగామ
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా..
మా గ్రామానికి డాక్టర్లు వచ్చి కంటి పరీక్షలు చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. మా దగ్గరికే వచ్చి ఉచితంగా పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను పంపిణీ చేయడం చాలా సంతోషకరం. సీఎంకు రుణపడి ఉంటా. -సక్కుబాయి ,తలకొండపల్లి
సీఎం సారు సల్లగుండాలి
కండ్లు మసకబారి ఎవరినీ గర్తుపట్టకుండా ఉండేవి. దవాఖానకు వెళ్తామంటే డబ్బుల్లేవు. దీంతో అలాగే బతుకుతున్నా. మా గ్రామంలో నాలుగేండ్ల క్రితం ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ క్యాంపులో డాక్టర్లు పరీక్షించి అద్దాలు ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి కండ్లు బాగా కనిపిస్తున్నాయి. సీఎం సారు సల్లగుండాలి
– బొల్ల నర్సమ్మ, తలకొండపల్లి
‘కంటి వెలుగు’ మంచి కార్యక్రమం
‘కంటి వెలుగు’ పేదలకు ఎంతో దోహదపడుతున్నది. ప్రైవేటులో కంటి పరీక్షలు చేసుకొని అద్దాలు, మందులు తెచ్చుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నది. అందు వల్ల చాలామంది కండ్లు కనిపించకున్నా సర్దుకుపోతున్నారు. గతంలో గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంపులో కంటి పరీక్షలు చేయించుకోగా వైద్యులు మందులు ఇచ్చారు. వాటినే వాడుతున్నా. కంటి వెలుగు మంచి కార్యక్రమం. -రాజప్ప, కొడంగల్
మందులు, కంటి అద్దాలు ఇచ్చారు
కండ్లు కనిపించకపోవడంతో గత నాలుగేండ్ల క్రితం మా గ్రామంలో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ శిబిరంలో వైద్యులు పరీక్షించి దృష్టి లోపం ఉందని గుర్తించి కొన్ని మందులు, కంటి అద్దాలు ఇచ్చారు. అప్పటి నుంచి కండ్లు మంచిగా కనిపి స్తున్నాయి. చిన్న, చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నా. కుమారులు లేని నాకు సీఎం కేసీఆర్ పెద్దకొడుకయ్యిండు. -వల్లూరి సత్యమ్మ, నోముల, ఇబ్రహీంపట్నం
వికారాబాద్ జిల్లాకు చేరిన 39,767 రీడింగ్ గ్లాసెస్
ఏర్పాట్లు పూర్తి..
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం పూర్తైంది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 19న ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి నవాబుపేటలో ప్రారంభిస్తారు.
– పల్వాన్కుమార్, వికారాబాద్ డీఎంహెచ్వో
వికారాబాద్, జనవరి 17(నమస్తే తెలంగాణ): శరీరంలోని అన్ని అవయవాల కంటే కండ్లు ప్రధానమైనవి. మనిషికి కంటి చూపు చాలా అవసరం. కండ్లు లేకపోతే జీవితం అంధకారంగా మారుతుంది. అందువల్ల కంటి సంరక్షణకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. అయితే చాలామంది ఆర్థిక సమస్యలు, నిర్లక్ష్యంతో దూరంగా ఉంటున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని 2018 ఆగస్టు 18 నుంచి 2019 మార్చి వరకు నిర్వహించింది. ఈ మొదటి విడుతలో వికారాబాద్ జిల్లాలో 3.48 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు అద్దా లు, అవసరమైన వారికి సర్జరీలను కూడా ప్రభుత్వం చేయించింది. ఈ నేపథ్యంలో మరోసారి కంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకున్నది. జిల్లాలో ఈనెల 19 నుంచి రెండో విడుత ‘కంటి వెలుగు’ను నిర్వహించేందుకు జి ల్లా వైద్యారోగ్యశాఖ అధికారు లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటి నుంచి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. కాగా ఈనెల 19న నవాబుపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
రోజుకు 650 మందికి పరీక్షలు..
జిల్లాలో మొదటి విడుత ‘కంటి వెలుగు’లో భాగంగా 3.48 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా..రెండోవిడుతలో జిల్లాలోని 10 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిరోజూ గ్రామీణ ప్రాంతాల్లో 300 మందికి, మున్సిపాలిటీల్లో 350 మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే కేంద్రాల వద్దకు ప్రజలు ఒకేసారి రాకుండా ఆశవర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికెళ్లి ఏ రోజున కంటి పరీక్షలకు రావాలో సూచించనున్నారు. ఈ దఫా కార్యక్రమంలో పంపిణీ చేయనున్న అద్దాలకు ప్రత్యేకంగా బార్ కోడ్ను ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు అందజేసే అద్దాలతోపా టు, సామగ్రి, ఫర్నిచర్ ఇప్పటికే జిల్లాకు చేరా యి.
అందులో 39,767 రీడింగ్ గ్లాసెస్ ఉ న్నా యి. కేంద్రాలకు వచ్చే వారికి తాగునీరు, కుర్చీలు తదితర వసతులను కల్పించనున్నారు. అయితే సర్జరీలు అవసరమైన లబ్ధిదారులకు హైదరాబాద్లోని సరోజిని దవాఖానకు రెఫర్ చేయనున్నారు. అయితేమొదటి విడుతలో 3. 48 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 76వేల మందికి అద్దాలను పంపిణీ చేశారు.
42 బృందాల ఏర్పాటు..
‘కంటివెలుగు’ రెండో విడుత కార్యక్రమాన్ని నేడు సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం ఈనెల 19 నుంచి జిల్లాలో కొనసాగనున్నది. ఇందుకోసం వైద్యారోగ్యశాఖ అధికారులు 42 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఎనిమిది మంది ఉంటా రు. అందులో మెడికల్ అధికారి, కంటి వైద్యులు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశవర్కర్లుంటారు. అయితే ఇప్పటికే ఆశ వర్కర్లు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇంటింటికెళ్లి బీపీ, షుగర్, దీర్ఘ, స్వల్పకాలిక వ్యాధుల వివరాలతోపాటు కంటి సమస్యలతో బాధపడుతున్నారా..? అద్దాలు వాడుతున్నారా..? శస్త్ర చికిత్స చేయించుకున్నారా అనే వివరాలను సేకరించారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’పై జిల్లా అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు.