ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం విద్యా దినోత్సవంలో భాగంగా విద్యాలయాలు సందడిగా మారాయి. ర్యాలీలు, మానవహారాలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో సంబురం అంబరాన్నంటింది. జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వేడుకల్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు అందజేశారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని ప్రసంగించారు.
బడంగ్పేట, జూన్ 20 : సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారని, పేద విద్యార్థుల భవితకు భరోసా కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవాన్ని మండలంలోని జిల్లెలగూడ చల్లాలింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించడంతోపాటు పాఠశాల ఆవరణలో మొక్కను నాటి మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన డిజటల్ తరగతి గదిని ప్రారంభించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా స్థాయి బోధనాభ్యసన సమూనాలను ప్రదర్శించారు. అనంతరం డీఈవో సుశీందర్రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పైసా ఖర్చు లేకుండా పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ముం దుకు సాగుతున్నారని.. అందువల్ల విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు నిండిపోతున్నాయన్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారాయన్నారు. ఇప్పటికే డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేసినట్లు వివరించారు. ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థుల స్కూల్ డ్రెస్సుల కోసం రూ.150 కోట్లు, నోట్ బుక్స్ల కోసం రూ.91 కోట్లు, టెక్ట్ బుక్కుల కోసం రూ.192 కోట్లు ఖర్చు చేసిందన్నారు. అంతేకాకుండా ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు నిపుణులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేయడంతోపాటు ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో విద్యార్థుల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. పదోతరగతిలో పది జీపీఏ సాధించిన పలువురు విద్యార్థులను మంత్రి ఘనంగా సత్కరించి రూ. పదివేలు అందజేశారు. అదేవిధంగా విదేశాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున అందించి ఆర్థిక చేయూతనిస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం ఆరు వేల మంది వరకు విదేశాలలో చదువుకుంటున్నారని ఆమె గుర్తు చేశారు. మన ఊరు-మన బడిలో భాగంగా మొదటి విడుతలో 9వేల పాఠశాలలను రూ. 3500 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలోని 8000 వేల గ్రామాల్లో రీడింగ్ గ్రంథాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారంలో మూడు రోజులపాటు సత్యసాయి ట్రస్టు వారు విద్యార్థులకు రాగిజావను పంపిణీ చేస్తారన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ అయాచితం శ్రీధర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వెంకటరమణారెడ్డి, రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, ఆర్డీవో సూరజ్కుమార్, మీర్పేట మేయర్ దుర్గ, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్ రాంచందర్, ఎంఈవో కృష్ణయ, కమిషనర్ నాగేశ్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, విద్యాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పటిష్టంగా విద్యావ్యవస్థ
రాష్ట్రంలో విద్యావ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది. ఇటీవల కేంద్ర విద్యాశాఖ బృందం సభ్యులు యాదాద్రి, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించి సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడులను సీఎం కేసీఆర్ సమూలంగా మార్చారని కితాబిచ్చారు. విద్యాశాఖ మంత్రి కృషి కూడా ఇందుకు కారణమే. -కరుణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
పిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వొద్దు
పిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వొద్దు.. వారికి పిల్లల కథల పుస్తకాలను ఇచ్చి వాటిని చదవడం అలవాటు చేయాలి. ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే అన్ని రకాల పుస్తకాలను చదవాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల చొరవ ఎంతో అవసరం.
– దేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్