పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతున్నదని, మహనీయులు చూసిన బాటలోనే నడుస్తూ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా వికారాబాద్, చేవెళ్లలో జరిగిన కార్యక్రమాల్లో వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి , ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్యలతో కలిసి మంత్రి ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాబూ జగ్జీవన్రామ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా ఉత్తమ సేవలందించారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనలో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల అభ్యున్నతికి దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చుతుండడంతో నేడు పారిశ్రామికంగా ప్రగతిని సాధిస్తున్నామన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులతో కొత్త జోనల్ విధానాన్ని అమలు చేసి స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. ప్రస్తుతం విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేసుకోవడం వల్ల ప్రతి నిరుపేదకు ప్రయోజనం చేకూరుతున్నదని తెలిపారు.
పరిగి, ఏప్రిల్ 5: మహనీయుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పనిచేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్లో బాబూ జగ్జీవన్రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ బాబూ జగ్జీవన్రామ్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పాటు అందించడంతోపాటు ఈ దేశానికి అనేక సామాజిక సేవలు అందించారని తెలిపారు. మహనీయులు చూపిన బాటలో నడుస్తూ వారిని ఎల్లప్పుడూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నిరుపేద దళిత కుటుంబాన్ని లక్షాధికారులను చేసే దిశగా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదని చెప్పారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో ఈ ప్రాంత విద్యార్థులకు వైద్య, విద్య అందుబాటులోకి రావడంతోపాటు వైద్య సేవలు ఉచితంగా అందుతాయని అన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన మేరకు భూముల కేటాయింపు కోసం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కొత్త జోనల్ విధానం అమలు చేసి స్థానికులకే 95శాతం ఉద్యోగాలు లభించేలా కృషి చేశారని మంత్రి పేర్కొన్నారు. 80వేల పైచిలుకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వరుసగా విడుదల చేసేందుకు సర్కారు నిర్ణయించిందని చెప్పారు. ముందుగా పోలీసు, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య, గ్రూప్-1 ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు విడుదల అవుతాయని మంత్రి తెలిపారు. ఉద్యోగార్థుల కోసం సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారని మంత్రి చెప్పారు. ఉత్సవ కమిటీ విజ్ఞప్తి మేరకు ఎన్నెపల్లి చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు అంచనాలు తయారు చేయించాల్సిందిగా కలెక్టర్కు మంత్రి సూచించారు. వికారాబాద్లో స్టడీ సర్కిల్కు ప్రతిపాదించడం జరిగిందని, త్వరలోనే శంకుస్థాపన సైతం చేయనున్నట్లు తెలిపారు.
ధరణిలో ఉన్న చిన్న చిన్న సమస్యలకు రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా కలెక్టర్కు సూచించారు. గ్రామాల్లో వివక్షకు గురవుతున్నట్లుగా వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీకి మంత్రి సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునితారెడ్డి మాట్లాడుతూ బాబూ జగ్జీవన్రామ్ భవన్ కోసం స్థలం ఎంపిక చేస్తే జిల్లా పరిషత్ నుంచి రూ.25లక్షలు మంజూరు చేస్తామని, అవసరమైతే ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు మంజూరు చేయించి కోటి రూపాయలతో భవనం నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ బాబూ జగ్జీవన్రామ్ సుదీర్ఘకాలం పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారని, వివిధ శాఖల మంత్రిగా పనిచేస్తూ, ఆయా శాఖల్లో తనదైన ముద్ర వేశారని తెలిపారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ బాబూ జగ్జీవన్రామ్ స్వాతంత్య్ర ఉద్యమంలో తన పాత్ర పోషిస్తూనే వివక్షకు గురవుతున్న ప్రజల కోసం పోరాటం చేశారన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో కులాంతర వివాహాలు చేసుకున్న ఎన్.సుచిత్ర-ఉ.సాయికుమార్, బి.మహేశ్వరి-టి.రవీందర్ జంటలకు రూ.2.50లక్షల చొప్పున ప్రోత్సాహక పత్రాలను మంత్రి సబితారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, ఎంపీపీ చంద్రకళ, జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు సంగీతం రాజలింగం, ఆర్డీవో విజయకుమారి, ఎస్సీ అభివృద్ధి అధికారి మల్లేశం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, బీసీ అభివృద్ధి అధికారి ఉపేందర్, జయంతి ఉత్సవాల కమిటీ కార్యదర్శి రవీందర్, సభ్యులు పి.అనంతయ్య, బి.కృష్ణ, ఎంమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనందం, పి.అంజయ్య, మల్లేశ్, శివరాజ్, న్యాయవాది ఆనందం, మహిపాల్, దళిత సంఘాల సీనియర్ నాయకులు భీమయ్య, అనంతయ్య, రామస్వామి, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్, ఏప్రీల్ 5: బాబూ జగ్జీవన్రామ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య చేవెళ్లలోని జగ్జీవన్రామ్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా జగ్జీవన్ రామ్ జాతికి ఎన్నో సేవలందించారని కొనియాడారు. సమాజంలో మార్పురావాలని, వెనుక బడిన వర్గాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఆయన కృషి చేశారని కొనియాడారు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. వెనుకబడిన సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి బాబూ జగ్జీవన్రామ్ అని కొనియాడారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి పి. వెంకటేశ్, మాజీ ఎంపీపీ బాల్రాజ్, వైస్ ఎంపీపీ ప్రసాద్, చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి, పామెన సర్పంచ్ మల్లారెడ్డి, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీలు, సీపీఐ నాయకుడు రామస్వామి, బాబూ జగ్జీవన్రామ్ యూత్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.