ఇబ్రహీంపట్నం, మార్చి 30 : మతం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నదని రాష్ట్ర ఐటీ, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఉప్పరిగూడ ఎక్స్రోడ్డు వద్ద పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ శంకుస్థాపనలో పాల్గొన్న అనంతరం శేరిగూడలో విలేకరులతో మంత్రి మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధిపొందాలని బీజేపీ మతం రంగును పులమడానికి యతన్నిస్తుందన్నారు. పదేండ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఉద్యోగావకాశాలు కల్పించలేదన్నారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం ఆచరణలో అమలు చేయలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిన ఘనత బీజేపీదేనన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలనూ బీజేపీ ప్రభుత్వం విపరీతంగా పెంచిందన్నారు. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ఆరోగ్యం కింద పది లక్షల ఆర్థిక సాయం, 500లకు గ్యాస్ సిలిండర్, 200యూనిట్లకు ఉచిత విద్యుత్ వంటి హామీలను ఇప్పటికే అమలు చేశామన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ప్రజల అవసరాలనుతీర్చి ప్రజాప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నదన్నారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులంతా సంఘటితంగా పని చేస్తూ ప్రజల అవసరాలను తీరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు మల్రెడ్డి రాంరెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్రెడ్డి, పాండురంగారెడ్డి, గురునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.