షాబాద్, మార్చి 22 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తున్నది. కంటి చూపు సమస్యలున్నవారి చింత తీర్చాలన్న సదుద్దేశంతో ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్యక్రమం ఆరంభం మొదలు ఇప్పటివరకు విజయవంతంగా కొనసాగుతుండగా, పేదల కండ్లల్లో వెలుగులు నిండుతున్నాయి. ప్రైవేటు దవాఖానలకు వెళ్లాలంటే ఆర్థిక స్థోమత లేక అవస్థలు పడేవారికి ఆపన్నహస్తం అందిస్తున్నది. చెంతనే కంటి శిబిరాలు ఏర్పాటు కావడంతో కండ్ల సమస్యలు ఉన్నవారు పరీక్షలు చేయించుకుంటున్నారు. బుధవారం వరకు వికారాబాద్ జిల్లాలో 2,36,359 మందికి, రంగారెడ్డి జిల్లాల్లో 4,05,828 మందికి కంటి పరీక్షలు చేశారు. రెండు జిల్లాలకు కలిపి 1,01,398 మందికి రీడింగ్ గ్లాసెస్, 34,859 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను అందజేశారు. ఇంకా కొందరికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ ఇవ్వగా రావాల్సి ఉన్నది. ‘కంటి వెలుగు’ శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం అద్భుత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నదని కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
పేదల కండ్లలో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘కంటి వెలుగు’ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 80 బృందాల ద్వారా వైద్యసిబ్బందికి తమకు కేటాయించిన గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డిజిల్లాలో ఇప్పటివరకు 4,05,828 మందికి కంటి పరీక్షలు చేసినట్లు సంబంధిత వైద్యరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా..
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో మొత్తం 80 బృందాలతో ప్రభుత్వం కంటి వెలుగు కేంద్రాలను నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 4,05,828 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 63,194 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయగా, 17,802 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశారు. మరో 35,116 మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసిన్నట్లు చెబుతున్నారు.
కంటి వెలుగుకు విశేష స్పందన
ఊరూరా ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్యశిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఏండ్ల తరబడి కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎం కేసీఆర్ ఉచితంగా కంటి పరీక్షలు చేయించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. రూపాయి ఖర్చు లేకుండా తమ గ్రామాలకే వైద్యులు వచ్చి మాకు కంటి పరీక్షలు చేయడం గొప్ప పరిణామమంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు.
వికారాబాద్ జిల్లాలో నేటి వరకు..
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న ‘కంటి వెలుగు’ వైద్య శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు శిబిరాలకు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా కంటి పరీక్షలతో పాటు ఉచితంగా అద్దాలు, కావాలసిన మందులు కూడా పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లాకు వచ్చిన 17232 ప్రిస్క్రిప్షన్ అద్దాల్లో నేటి వరకు 17057 అద్దాలను ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. దూరపు చూపు సమస్యతో బాధపడుతున్న తమకు ఎంతో నాణ్యమైన అద్దాలు పంపిణీ చేవారని బాధితులు పేర్కొంటున్నారు.
భాగస్వాములవుతున్న ప్రజాప్రతినిధులు
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజా ప్రతినిధులు భాగస్వాములవుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, మార్కెట్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు కంటి వెలుగు శిబిరాల్లో పాల్గొంటున్నారు. వికారాబాద్ జిల్లాలో 42 వైద్య బృందాలు పట్టణాలు, గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తుండగా ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునే విధంగా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.
నాణ్యమైన అద్దాలు
కంటి పరీక్షలు చేసిన తరువాత కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న వారికి అక్కడికక్కడే రీడింగ్ గ్లాసులు పంపిణీ చేస్తున్నారు. దూరపు చూపు సమస్య ఉన్నవారికి అద్దాలను ఆర్డర్ చేసి కొన్ని రోజుల తరువాత ఆశ కార్యకర్తలు బాధితుల ఇంటికి వెళ్లి అందజేస్తున్నారు.
17057 ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ
వికారాబాద్ జిల్లాలో నేటి వరకు 2,36,359 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాకు 73609 రీడింగ్ గ్లాసులు రాగా 38,204 మందికి పంపిణీ చేశారు. అదేవిధంగా దూరపు చూపు సమస్యతో బాధపడుతున్న 29,919 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేయగా 17,232 అద్దాలు జిల్లాకు వచ్చాయి. వీటిలో 17057 మందికి ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలను ఆశ కార్యకర్తలు బార్కోడ్ ఆధారంగా పేషంట్ ఇంటికి వెళ్లి పంపిణీ పూర్తి చేశారు. జిల్లాలోని 258 మంది గ్రామాలు, 52 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించారు. జూన్ మొదటి వారం వరకు జిల్లాలోని మొత్తం ఆవాస ప్రాంతాలను కవర్ చేస్తూ కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహిస్తారు.
జిల్లాలో 4,05,828 మందికి కంటి పరీక్షలు
జిల్లా వ్యాప్తంగా 80 బృందాల ద్వారా కంటి వెలుగు కేంద్రాలను నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 4,05,828 మందికి కంటి పరీక్షలు నిర్వహించాం. ఇందులో 63,194 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయగా, 17,802 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశాం. గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కేంద్రాలను సక్రమంగా నిర్వహించేలా సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నాం.
– వెంకటేశ్వర్రావు, రంగారెడ్డిజిల్లా వైద్యరోగ్యశాఖ అధికారి
చూపు బాగా కనిపిస్తుంది
నాకు దూరంలో ఉన్నవి కనపడేవి కావు. కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేసుకుంటే కొన్ని రోజుల తరువాత అద్దాలు ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇప్పుడు దూరంలో ఉన్నవి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతకుముందు కళ్లలో నీళ్లు కారేవి. ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు. ప్రైవేటులో కంటి పరీక్షలు చేయించుకుంటే వేల రూపాయలు ఖర్చయ్యేవి. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చారు. పేదలకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులకు మనమందరం సహకరించాలి.
–మోత్కూరి నర్సమ్మ, బొంరాస్పేట