తాండూరు, మార్చి 3 : ఉక్రెయిన్-రష్యాకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకుపోయిన తెలుగు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో క్షేమంగా సొంత ప్రాంతాలకు వస్తున్నారు. తెలంగాణకు చెందిన 10 మంది విద్యార్థులు గురువారం శంషాబాద్ ఎయిర్పొర్టులో దిగి తమ సొంత గ్రామాలకు వెళ్లారు. ఇందులో వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మదిహ అనాం ఉన్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లి ఘనంగా స్వాగతం తెలిపి ఆప్యాయత, అనురాగాలను చాటారు. అనంతరం హైదరాబాద్లోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో ఉన్నత చదువు కోసం వెళ్లి యుద్ధం కారణంగా తాండూరుకు తిరిగి వచ్చిన మదిహ అనాం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంతో భారతీయులు చాలా భయాందోళనల్లో ఉన్నారని తెలిపారు. భారతదేశానికి తిరిగి వచ్చేటప్పుడు జెకొస్లోవేకియా సరిహద్దు ప్రాంతంలో చాల ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో క్షేమంగా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చామని సంతోషం వ్యక్తం చేస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనతో పాటు హైదరాబాద్కు చెందిన మరో ఆరుగురు విద్యార్థులు వచ్చినట్లు తెలిపారు.