ఇబ్రహీంపట్నం, జూలై 29: రంగారెడ్డి జిల్లాలో అంతరించిపోయిన అడవుల సంరక్షణలో భాగంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమానికి అటవీ అధికారులు సిద్ధమయ్యారు. నగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లాలో అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతోపాటు జిల్లా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పార్కులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఏడు రేంజ్ల పరిధిలో శంషాబాద్, చిలుకూరు, హిమాయత్నగర్ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ అధికారులు అడవుల సంరక్షణతోపాటు అడవులను పార్కులుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. అలాగే, మిగతా రేంజ్ల పరిధిలో అధిక సంఖ్య లో మొక్కలు నాటాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమాన్ని ఆయా రేంజ్ అధికారులకు అటవీ శాఖ అధికారులు అప్పగించారు. ఇప్పటికే పలు డివిజన్లల్లో హరితహారంలో భాగంగా జోరుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇటీవల మంత్రి సబితాఇంద్రారెడ్డి మంచాల మండలంలోని జా పాల అటవీప్రాంతంలో ఒకేరోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమా న్ని స్ఫూర్తిగా తీసుకుని అన్ని రేంజ్ల్లోనూ అధిక సంఖ్యలో మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. దీంతో జిల్లాలోని ఏడు రేంజ్ల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరం గా సాగుతున్నది. మరోవైపు హరితహారంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీ ప్రాం తాల్లో ఉపాధిహామీ కూలీలతో పెద్ద ఎత్తున మొక్కలను నాటేందుకు గోతులను అధికారులు తవ్విస్తున్నారు. ఈనెలాఖరులోపు మొక్కలు నాటే కార్యక్రమాన్ని 50 శాతానికిపైగా పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. కాగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించే బాధ్యతను కూడా అటవీశాఖ అధికారులే తీసుకున్నారు.
గుంతల్లో మొక్కలను నాటుతున్న ఉపాధి హామీ సిబ్బంది
జిల్లాలో ఏడు రేంజ్లు..
రంగారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్న అటవీప్రాంతాన్ని అధికారులు ఏడు రేంజ్లుగా విభజించారు. ఇందు లో ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్లు, చిలుకూరు, హయత్నగర్, మంఖాల్, శంషాబాద్ రేంజ్లున్నాయి. ఒక్కొ క్క రేంజ్ పరిధిలో అడవులను సంరక్షించేందుకు అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీగా చేపట్టాలని నిర్ణయించారు. ఇబ్రహీంపట్నం రేంజ్లో 6 లక్షలు, కందుకూరు రేంజ్లో 4 లక్షలు, ఆమనగల్లు రేంజ్లో 4 లక్షలు, మంఖాల్ రేంజ్లో 2.50 లక్షలు, శంషాబాద్ రేంజ్లోని నాగారం బ్లాక్లో 4.50 లక్షలు, హయత్నగర్ రేంజ్లో 50 వేలు, చిలుకూరు రేంజ్లో 1.50 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఇందులో శంషాబాద్ రేంజ్ పరిధిలోని నాగారంలో ఇప్పటికే అధికారులు 4.50 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఇబ్రహీంపట్నం రేంజ్ పరిధిలో 6 లక్షల మొక్కలను నాటాల్సి ఉం డగా ఇప్పటికే సుమారు 4 లక్షల మొక్కలను నాటినట్లు తెలిపా రు. అదేవిధంగా మిగతా రేం జ్ల్లోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. మరో పది రోజు ల్లో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. కాగా మొక్క లు నాటే కార్యక్రమానికి జిల్లా వాసుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మరో వైపు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు, రాజకీయ నాయకులు భాగస్వాములవుతున్నారు.
హెచ్ఎండీఏ పరిధిలో అడవుల అభివృద్ధికి బృహత్ ప్రణాళిక
రంగారెడ్డి జిల్లాలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అడవులను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇబ్రహీంపట్నం రేంజ్ పరిధిలోని గుర్రంగూడ అటవీప్రాంతాన్ని ఇప్పటికే హెచ్ఎండీఏ అధికారులు అభివృద్ధి చేశారు. ఇక్కడ వాకర్పార్కు, చిల్డ్రన్స్పార్కు, సందర్శకులు సేద తీరేందుకు అవసరమైన అన్ని రకాల వసతులను కల్పించారు. అలాగే, మంఖాల్ అటవీ ప్రాంతంలోనూ అడవుల అభివృద్ధి కి పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. పలువురు స్థానికులు, పర్యాటకులు ఇక్కడ తీర్చిదిద్దిన వాకింగ్ పార్కుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం
జిల్లాలోని ఏడు రేంజ్ల పరిధిలో నిర్దేశించిన లక్ష్యాన్ని గడువులోపే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో హరితహారంలో భాగంగా ఆరులక్షల మొక్క లు నాటే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాం. ఈ రేంజ్ పరిధిలోని నోము ల, దండుమైలారం, అనాజ్పూర్, గున్గల్, జాపాల తదితర అటవీప్రాంతాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలను నాటుతున్నాం. మిగతా ప్రాంతాల్లోనూ మొక్కలను నాటేందుకు గుంతలు తీసే పనులు చురుగ్గా సాగుతున్నాయి.
–విష్ణువర్ధన్, ఇబ్రహీంపట్నం రేంజ్ అధికారి