కలెక్టరేట్: జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆదివారం సాయంత్రం జిల్లా ప్రభుత్వ శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు (ఆదివారం) రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ప్రజలు ఇండ్ల నుంచి బయటకెళ్లొద్దన్నారు. నీటిపారుదల, రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ, అలాగే మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి కల్వర్టులు, రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలని, చెరువులు, జలాశయాల నీటి మట్టాలను పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సిరిసిల్ల పట్టణంలో వరద ప్రభావిత ప్రాంతాలైన శాంతినగర్, వెంకంపేట, ఇతర లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా పలువురు జిల్లా అధికారులకు కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో శిథిలమైన ఇండ్లు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఆస్తి, పంట నష్టం వివరాలను జిల్లా యంత్రాంగానికి తెలిపేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు.
కంట్రోల్ రూమ్ నెంబర్ 9398684240 సంప్రదించాలన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఇన్చార్జి డీఆర్వో టి.శ్రీనివాసరావు, ఇరిగేషన్ అధికారి అమరేందర్రెడ్డి, డీపీవో రవీందర్, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ కిషన్రావు, మిడ్మానేరు ఈఈ జగన్, ప్యాకేజీ -9 ఈఈ శ్రీనివాస్, సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, శ్యాంసుందర్రావు తదితరులు పాల్గొన్నారు.