కలెక్టరేట్ : జిల్లాలో ప్రగతిలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర భూసేకరణ పనులను వేగవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన సమీకృత కలెక్టరేట్లోని సమావేశ హాల్లో రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్యాకేజీ 9, 10, 11, 12 పనులు, రైల్వే భూసేకరణ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్యాకేజీ 9, 10, 11, 12 ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, రైల్వే భూసేకరణ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ కోసం 440 ఎకరాల్లో భూసేకరణను వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా భూసేకరణ పూర్తి చేసి తనకు అందించాలన్నారు. సమీక్షలో ఇన్చార్జి డీఆర్వో, భూసేకరణ అధికారి టి.శ్రీనివాసరావు, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ అజ్మీరానాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.