రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు నీవు చేసిందేంటని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ప్రశ్నించారు. నేతన్నల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన మూడు బోర్డులను కేంద్రం రద్దు చేస్తే ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు నెలలుగా వస్త్ర పరిశ్రమ బంద్ కావడంతో ఉపాధి కరువై ఓ నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ నేపథ్యంలో మళ్లీ సిరిసిల్లలో ఆకలి చావులు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో సీఐటీయూ ఆధ్వర్యంలో జేఏసీ పోరాటం చేసిందన్నారు. సిరిసిల్లలోని పవర్లూమ్ అనుబంధ సంఘాలు జేఏసీగా ఏర్పడి చేసిన పోరాటాన్ని బండి తన రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నారని విమర్శించారు. జేఏసీ పోరాటంతో 50కోట్లు విడుదలైతే.. తాను లేఖ రాయడంతో ప్రభుత్వం దిగొచ్చి 50కోట్లు విడుదల చేసిందని ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని ఖండించారు. కార్మికులను ఆదుకోడానికి కేంద్రం నుంచి సంజయ్ ఏమైనా వస్త్ర ఆర్డర్లు తెచ్చారా..? అని నిలదీశారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఈఎస్ఐ దవాఖాన నిర్మాణం కోసం నయాపైసా తీసుకురాలేదని విమర్శించారు. ఐదేండ్లుగా ఎంపీగా ఉండి నిధులు తేలేని సంజయ్ సిరిసిల్ల ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 5,200మంది నేతన్నలకు రావాల్సిన 18కోట్ల యారన్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కోడం రమణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మోర అజయ్, నాయకులు ఎల్లారెడ్డి, గణేశ్, రాజశేఖర్, దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.