హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండు, మూడు నెలలకోసారి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనల కంటే క్రమబద్ధీకరణపై ఎకువ దృష్టి సారించాలని, వాతావరణ మార్పులు, పనివేళలు, రద్దీ సమయాలు, స్థానిక సంస్కృతిని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఔటర్ రింగ్రోడ్డుపై ప్రమాదాలు జరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఎకడపడితే అకడ వాహనాలు నిలుపకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు అవసరమైనచోట అండర్పాస్, ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాలు మూమెంట్ ఉండేలా చూడాలని ఆదేశించారు.
తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించండి
తెలంగాణకు చెందిన యువకులు, విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఇందుకు అవసరమైతే చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ను, ఈగల్ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యను ఆదేశించారు. విద్యా సంస్థల్లో క్యాంపస్ లోపల డ్రగ్స్కు సంబంధించి ఏ ఘటన జరిగినా యాజమాన్యాలను బాధ్యులను చేయాలని, క్యాంపస్ బయట జరిగే యాక్టివిటీని గుర్తించి సమాచారాన్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.