జగిత్యాల, ఏప్రిల్ 23 : ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, వరికి 500 బోనస్ ఏదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. హనుమాన్ జయంతి రోజు జీవన్రెడ్డి హనుమంతుడి సాక్షిగా బాండ్ పేపర్ రాసిచ్చి, దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పడం సరికాదని సూచించారు. గతంలో అర్వింద్ పసుపుబోర్డు కోసం బాండ్ పేపర్ రాసిచ్చినా అది అమలు కాలేదని విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులమతాలతోపాటు దేవుళ్లను ఎన్నికల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. గతేడాది నవంబర్ 27న ఎడ్ల అంగడిలోని ఆలయంలో హనుమంతుడి పాదాల సాక్షిగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి బాండ్ పేపర్ రాసిచ్చారని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 150 రోజులు గడిచినా అమలు కాలేదన్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు 2500 అమలు కాలేదన్నారు. ఆర్టీసీ బస్సులు పెంచకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, గతంలో కోరుట్ల నుంచి భద్రాచలానికి బస్సు ఉండేదని, దాన్ని కూడా బంద్ చేశారన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి 15 వేలు, కౌలు రైతులకు 12 వేలు, ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని చెప్పారని, కానీ అమలు కాలేదన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డికి ప్రజ లు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్గౌడ్, పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మైనార్టీ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, జడ్పీటీసీ మహేశ్, మాజీ కౌన్సిలర్ బాలే శంకర్, కౌన్సిలర్ క్యాదాసు నవీన్, సోషల్ మీడియా అధ్యక్షుడు అలిశెట్టి వేణు,ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీరామ్ భిక్షపతి, మాజీ సర్పంచ్ రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.