కొండాపూర్, మే 18: కొవిడ్ రోగులను గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి వైద్య సర్వే దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కలెక్టర్ అమోయ్కుమార్, జిల్లా వైద్యాధికారులతో కలిసి మంగళవారం మంత్రి సందర్శించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులతోపాటు గర్భిణులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జిల్లా దవాఖానలో 150 బెడ్లు ఉన్నాయని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో మరో 100 ఆక్సిజన్ పడకలను ఏర్పాటుచేస్తామని మంత్రి చెప్పారు. జిల్లావ్యాప్తంగా వనస్థలిపురం (50), షాద్నగర్ (50), చేవెళ్ల (50), జల్పల్లి (40)లో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటుచేస్తున్నామని ప్రకటించారు. జిల్లా దవాఖాన ప్రత్యేకాధికారిగా శేరిలింగంపల్లి తాసిల్దార్ వంశీమోహన్ను నియమించామని పేర్కొన్నారు. జిల్లా వైద్యశాలలో కొవిడ్ రోగులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి, ఝాన్సీ, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ, ఆర్ఎంవో రామకృష్ణ, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవి కిరణ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రారెడ్డి, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస్, సర్కిల్ 20 ఏఎంహెచ్వో డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.