ఈ ఏడాది నుంచే జేఎన్టీయూ తరగతులు
మంత్రి కేటీఆర్ చొరవతో ప్రారంభానికి ఏర్పాట్లు
మొదట ఐదు కోర్సులు
టెక్స్టైల్ కోర్సు ప్రత్యేకం
తాత్కాలిక ఏర్పాటుకు పరిశీలనలో ఐటీఐ, డిగ్రీ కళాశాలలు
వారంలో జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ రాక
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ);కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో త్వరలోనే సాంకేతిక విద్య ప్రారంభం కాబోతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో పట్టణానికి జేఏన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు, ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించబోతున్నది. రెండో బైపాస్రోడ్డులోని అపెరల్ పార్కు సమీపంలో కాలేజీ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించగా, తాత్కాలిక ఏర్పాటుకు ఐటీఐ, డిగ్రీ కళాశాలలను పరిశీలిస్తున్నది. వీటిలో వసతులను పరిశీలించేందుకు త్వరలో జేఎన్టీయూ వైస్ చాన్సలర్ కట్ట నర్సింహారెడ్డి రానుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాగా, మొదట ఐదు కోర్సులు ప్రారంభించనుండగా, ఇందులో టెక్స్టైల్ కోర్సును ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నది.
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో జేఏన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. గత నెల 4న సిరిసిల్ల పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్కు మంత్రి కేటీఆర్ జేఏన్టీయూ, మెడికల్ కళాశాలలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ వేదికపైనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. పట్టణ రెండో బైపాస్రోడ్డులోని అపెరల్ పార్కు సమీపంలో కళాశాలను నిర్మించనున్నారు. ఇందుకు 88 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే ఈ ఏడాదే ఐదు కోర్సులను ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని ఐటీఐ, అగ్రహారంలోని డిగ్రీ కళాశాలలను అధికారులు పరిశీలించి సర్కారుకు నివేదించారు. ఈ కళాశాలల్లో వసతుల పరిశీలనకు వచ్చే వారంలో జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ కట్ట నర్సింహారెడ్డి రానున్నారు. ఇక్కడే అధికారులతో చర్చించిన మీదట తుది నివేదికను సమర్పించనున్నారు.
టెక్స్టైల్స్ కోర్సుకు తొలి ప్రాధాన్యం..
జేఎన్టీయూలో 7 కోర్సులకు గాను మొదట ఐదు కోర్సులు ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. అక్టోబర్ నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు వైస్ చాన్స్లర్ కట్ట నర్సింహారెడ్డి తెలిపారు. 5 కోర్సుల్లో 320 మంది విద్యార్థులకు బోధనావకాశం కల్పించనున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైనందున టెక్స్టైల్ కోర్సుకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెకానికల్, సివిల్, ఇంజినీరింగ్, కంప్యూటర్స్ కోర్సులు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు విద్యాశాఖ అధికారులు భవనాల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు.
అందుబాటులో ఉన్నత విద్య..
మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి రానున్నది. ఇప్పటి దాకా డిగ్రీ కళాశాలకే పరిమితమైన ఈ ప్రాంతంలో అగ్రికల్చరల్, వ్యవసాయ పాలిటెక్నిక్, ఐటీఐ, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుతో ఇక్కడి విద్యార్థులకు దూర ప్రాంతాలకు వెళ్లే తిప్పలు తప్పనున్నాయి. తాజాగా జేఎన్టీయూ ఇంజినీరింగ్, వచ్చే ఏడాది మెడికల్ కళాశాలల ఏర్పాటుతో సిరిసిల్ల విద్యాసంస్థలకు నిలయంగా మారనున్నదని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శుభ పరిణామం..
సిరిసిల్లకు జేఎన్టీయూ వస్తదని ఎప్పుడూ ఊహించలేదు. మంత్రి కేటీఆర్ వల్లే సాధ్యమైంది. ఇప్పటికే వ్యవసాయ పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఈ కాలేజీల నిర్మాణంతో పల్లె విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది.
కేటీఆర్ కృషి ఫలితమే..
మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగానే సిరిసిల్ల ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. కాళేశ్వరం జలాలను తెచ్చి మెట్ట భూములకు జీవం పోసిండు. మౌలిక వసతుల కల్పనకు విరివిగా నిధులిచ్చిండు. ఉన్నత విద్యకోసం వందల కిలోమీటర్ల దూరం వెళ్లే ఈ ప్రాంత పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. వారి పక్షాన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు.