పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పూజలు, క్షుద్రపూజలకు సంబంధించిన ఒక ఉదంతమిది. భక్తివిశ్వాసాలున్న ఆయన వాటిని మూఢనమ్మకంగా అనుసరించాలనుకోలేదని సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ ‘అసలేం జరిగిందంటే..’ పుస్తకంలో రాసినదాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రసాద్ 1992 మే లో ప్రధాని కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ హోదాలో మీడియా సలహాదారుగా చేరారు. ఆయన చేరిన కొన్ని నెలలకు ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి కొందరు పండితులు వచ్చి- పీవీ పదవి పోవాలని కొందరు క్షుద్రశక్తుల ఆరాధన చేయిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన పీవీకి చెప్పగా పెద్ద పెట్టున నవ్వి తేలికగా తీసిపారేశారట. ఆ సందర్భంగా కొనసాగిన సంభాషణ సంక్షిప్తంగా..
‘ఏమయ్యా ప్రసాదూ, నాకు ప్రధానమంత్రి పదవి ఎవరు ఏ శక్తులకు పూజ చేస్తే వచ్చిందయ్యా? ఇవాళ ఎవరో క్షుద్రపూజలు చేయిస్తే పోతుందా? అది పోయే రోజు వస్తే, నాకు అనుకూలంగా ఎవరెన్ని పూజలు చేస్తే మాత్రం ఆగుతుందా..’
‘అంటే సర్, మీరు ఈ పూజల్నే నమ్మరా? లేక ఎవరో చేయిస్తున్నారన్నది నమ్మరా?..’
‘పూజల ప్రభావం గురించి నాకు తెలియదయ్యా. ఉజ్జయిని పండితులు చెప్పింది నిజం కాదని మాత్రం అనను. ఎందుకంటే ఇలాంటివి ఢిల్లీ రాజకీయాలలో సహజం’.
‘సర్, మనం కూడా ఏమన్నా చేద్దాం సర్’
‘ఏమిటీ, క్షుద్రపూజలా?..’
‘అహహ, అది కాదు సర్. వాళ్లు చేసే క్షుద్రపూజలను నిర్వీర్యం చేయించే సాత్తిక పూజలేమైనా చేయిస్తే మంచిదిగదా అని.. మీ ఇష్టం. మీరెలా చెప్తే అలా సర్.. మీకు అసలు విశ్వాసం లేదా సర్?’
‘పూజలు పునస్కారాల మీద విశ్వాసం లేక కాదు ప్రసాద్. వేద విద్యల మీద నాకు అపారమైన నమ్మకం. కానీ మనకు నమ్మకం ఉందని నలుగురికీ తెలిస్తే, ముఖ్యంగా మనం కీలకమైన పదవులలో ఉన్నప్పుడు, ఈ విశ్వాసాన్నే మన బలహీనతగా భావించి రకరకాల వాళ్లు మన చుట్టూ చేరతారు. దానివలన మనకెంత లాభం కలుగుతుందో తెలియదు గానీ వాళ్లు మాత్రం కచ్చితంగా లాభపడతారు.. అంతెందుకు? చంద్రస్వామిని అన్ని పార్టీల నాయకులు చేరదీస్తుంటారు, ఎందుకంటావ్? ఇదే సేవ చేస్తుంటాడు కాబట్టే..’
‘పోనీ మీ తరపున ఆయనేమైనా చేస్తున్నాడంటారా?’
‘నేను చేయమని అడగలేదు, తను చేస్తానన్నా ప్రోత్సహించలేదు. నా మీద అతనికి ఆ అసంతృప్తి ఉంది. హైదరాబాద్లో నేను మంత్రిగా ఉన్నప్పట్నుంచీ తెలిసినా ఇలాంటి వాటి విషయంలో ఎప్పుడూ ప్రోత్సహించలేదు. కావలసినవాళ్లు చేయించుకుంటారు. చాలా ఖరీదైన స్వామి కూడా. డబ్బుల్లేకుండా ఏ పూజా ఎవరికీ చేయడు. ఆ మధ్య ఒకసారి కలిసి, ‘మీరేం ఖర్చు పెట్టక్కరలేదు, మీరు సరేనంటే మీ తరపున ఖర్చుపెట్టేవాళ్లను నేను చూసుకుంటాను’ అన్నాడు. నాకు ఇష్టం లేదు. అతనికి చనువిస్తే ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు. ముందు ప్రచారం మాత్రం బాగా జరుగుతుంది. ..అయినా ప్రసాద్, పూజలు, హోమాలు, యాగాలు ఎన్నో చేయించి కూడా ఇందిరాగాంధీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయం మనం మర్చిపోకూడదయ్యా..’
ఇవి కూడా చదవండి..