పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయనతో తన జ్ఞాపకాలను కేంద్ర టెలికాం శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ త్రిపురనేని హనుమాన్ చౌదరి ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
పీవీతో మీకున్న సాన్నిహిత్యం ఎలాంటిది..?
1965 నుంచి పీవీతో నాకు పరిచయం. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఏపీ టెలి కమ్యూనికేషన్స్ శాఖ జనరల్ మేనేజర్ను. ఆ తర్వాత ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లారు. నేను కూడా కేంద్ర టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఢిల్లీ వెళ్లాను. అలా తరచూ కలుస్తుండటం వల్ల ఆయనతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. మా మేనత్త, అప్పటి ఖమ్మం ఎమ్మెల్యే లక్ష్మీకాంతమ్మ ద్వారా కూడా పీవీతో నాకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.
పీవీతో మరచిపోలేని జ్ఞాపకాలు ఏమున్నాయి..?
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1982లో టెలికం సంస్థ ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయాలని భావించారు. రక్షణశాఖ మిరాజ్ యుద్ధ విమానాలను కూడా కొనాలనుకున్నది. ఆ విమానాలను ఇచ్చేందుకు అమెరికా, రష్యా ఒప్పుకోలేదు. కానీ ఫ్రాన్స్ కంపెనీ ముందుకొచ్చింది. అయితే తమ దేశానికి చెందిన ఈ 10 బీ టెక్నాలజీ టెలికం పరికరాలను కొనాలనే షరతును విధించింది. దీంతో ప్రధాని ఇందిర పీవీని సంప్రదించారు. ఆయన నా ద్వారా ఫ్రాన్స్ కంపెనీ ఈ 10 బీ టెక్నాలజీ నాణ్యతను తెలుసుకున్నారు. మిగతా దేశాలతో పోల్చితే 2-4 శాతం తక్కువ నాణ్యత ఉంటుందని చెప్పాను. అయినా దేశ రక్షణ ప్రయోజనాల దృష్ట్యా ఫ్రాన్స్ నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను కొందామని ప్రధానికి ఆయన సూచించారు. వరల్డ్ బ్యాంకు నిధులను కూడా కాదని ఆమె అందుకు ఒప్పుకొన్నారు.
పీవీ భావనలు ఎలా ఉండేవి..?
సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో విలువిచ్చేవారు. పశ్చిమగోదావరి మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు కొన్ని నిధులను పోగుచేసుకొని, విద్యా మంత్రి పీవీని కలిసి తమకు ఒక పాఠశాల కావాలని కోరారు. ఆయన నన్ను పిలిచి భారతీయ సంస్కృతిని భావితరాలకు తెలియజేస్తూ, వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దేలా పాఠశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నేను తొలుత భారతీయ విద్యాభవన్ విద్యాసంస్థను జూబ్లీహిల్స్లో ఏర్పాటుచేసి ఆ తర్వాత భీమవరం, గుంటూరు ప్రాంతాలకు విస్తరించాం. అలా భారతీయ విద్యాభవన్ ప్రాణం పోసుకున్నది.
పీవీ వ్యక్తిత్వాన్ని వివరిస్తారా..?
భేషజాలు లేని కార్యసాధకుడు. సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి స్మృత్యర్థం కవిరాజ సాహితీ నిలయాన్ని గుడివాడలో నిర్మించాలని సాహితీవేత్తలు భావించారు. ఇదే విషయమై విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీని కలిశారు. రామస్వామి చౌదరి బ్రాహ్మణ వ్యతిరేకి. అయినప్పటికీ ఎలాంటి భేషజాలకు పోకుండా పీవీ స్వాగతించి గుడివాడలో 1500 గజాల స్థలం కేటాయించేలా చేశారు.
పీవీ సంస్కరణలు, వాటి ప్రభావం ఏమిటీ..?
టెలికం రంగం అందించలేకపోతున్న సేవలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. మొదట చెన్నై, ముంబయి, ఢిల్లీ నగరాల్లో ప్రైవేట్ కంపెనీలకు మొబైల్ సర్వీస్లను అప్పగించారు. 1994 నేషనల్ టెలికం పాలసీని తీసుకొచ్చారు. దీనివల్లనే మొబైల్ ఫోన్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. 1988-1994 వరకు దేశంలో కోటి మందికే టెలిఫోన్ కనెక్షన్లు ఉండేవి. పీవీ వల్ల ఒక్క నెలలోనే 12 ప్రైవేట్ కంపెనీలు 1.80 లక్షల కనెక్షన్లు ఇచ్చాయి. టెలికం ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు టెలి కమ్యూనికేషన్లోకి వచ్చాయి.
పీవీ శతజయంతి ఉత్సవాలపై మీ అభిప్రాయం?
ముఖ్యమంత్రి కేసీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా ఉన్నది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ర్టాల్లోనూ, విదేశాల్లోనూ నిర్వహిస్తుండటం అభినందనీయం. అందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.