ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56 నాటౌట్), జాక్ క్రాలీ (46) ఇద్దరు సెంచరీ భాగస్వామ్యంతో భారీ ఛేజ్ను అద్భుతంగా ఆరంభించారు. ఈ క్రమంలో వికెట్ కోసం భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బౌలర్లందరూ ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా తియ్యలేకపోయారు.
ఇలాంటి సమయంలో మళ్లీ కెప్టెన్ బుమ్రానే భారత్ నమ్ముకుంది. 22వ ఓవర్లో బంతి అందుకున్న బుమ్రా.. నాలుగో బంతికి క్రాలీని క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన బంతిని క్రాలీ వదిలేశాడు. కానీ అది అతను అనుకున్నంత ఎత్తు బౌన్స్ అవలేదు. దాంతో ఆఫ్ స్టంప్ చివరను ముద్దాడింది. దాంతో క్రాలీ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ జట్టు 22 ఓవర్లలో 107/1 స్కోరుతో నిలిచింది.