కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ను అప్రజాస్వామికంగా కూల్చివేశారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజా ప్రభుత్వాలను గద్దెదింపుతున్నారని మండిపడ్డారు.
అధికార మదంతో ప్రజలను తొక్కిపెడుతున్న మోదీ సర్కార్ను దేశ ప్రజలు రానున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో కూల్చివేస్తారని దీదీ హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ప్రతీకారేచ్చతో రగులుతూ అక్రమ పద్దతుల్లో ప్రభుత్వాలను కూల్చుతోందని ఆరోపించారు.
మహారాష్ట్రలో వారు గెలిచినా ప్రజల హృదయాలను వారు గెలవలేరని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఓ వార్తా చానెల్తో మాట్లాడుతూ దీదీ వ్యాఖ్యానించారు.