-ఉద్యోగ నియామక వయసును 40 ఏండ్లకు పెంచేలా కృషి
-టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు
యైటింక్లయిన్కాలనీ: జాతీయ సంఘాలు వారసత్వ ఉద్యోగాలను పొగొట్టి కార్మిక కుటుంబాల్లో చీకటిని నింపగా సీఎం కేసీఆర్ కారుణ్య నియామకాలతో వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఆ కుటుంబాల్లో వెలుగులు నింపారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. మంగళవారం ఆర్జీ-2 ఏరియాలోని వకీలుపల్లి గని ఫిట్ సెక్రటరీ హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ సంఘాలు వారసత్వ ఉద్యోగాలను పోగొట్టగా, ఆ ఉద్యోగాల అమలుకు సీఎం కేసీఆర్ స్వీకారం చూట్టగా.. ఈ జాతీయ సంఘాలు కోర్టుకెళ్లి రాకుండా అడ్డుకున్నాయని విమర్శించారు.
కానీ సీఎం కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం న్యాయకోవిదులను సంప్రదించి మరోమారు ఆటంకం కలుగకుండా కారుణ్య రూపంలో కార్మికులపై కరుణ చూపారని తెలిపారు. వారసుల ఉద్యోగ వయస్సును 35 నుంచి 40 ఏండ్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దీనిపై ఇప్పటికే అనేకమార్లు యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. మారుపేర్లతో పనిచేస్తున్న కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని దీనిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే సింగరేణి యాజమాన్యానికి తగు సూచనలు చేశారని తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఏలాంటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
గత ఏడాది సంస్థ ఆర్జించిన వాస్తవ లాభాల నుంచి దసరాలోపు కార్మికులకు ఆర్థిక ప్రయోజనం కలిగేలా లాభాల వాటాను ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జాతీయ సంఘాలు కేవలం వాళ్ల ఉనికి కోసం అసత్య ఆరోపణలు చేస్తూ కార్మికులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆ సంఘాలకు ఏ మాత్రం కార్మికులపై ప్రేమ ఉన్నా సింగరేణిలో అమలవుతున్న అనేక హక్కులను కోల్ ఇండియాలో అమలు చేయించాలని సవాల్ విసిరారు.
సింగరేణిలో కార్మిక సమస్యల పరిష్కారానికి తాము చేస్తున్న కృషిని ఈ సంఘాలు హర్షించకపోగా విమర్శించడం సిగ్గు చేటన్నారు. గతంలో ఈ సంఘాలు పని చేసిన కాలంలో సాధించిన హక్కులు, టీబీజీకేఎస్ అధికారంలోని కాలంలో సాధించిన హక్కులపై కార్మికుల సమక్షంలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ఆనంతరం గనిలో పని చేస్తున్న 50మంది ఉద్యోగులు యూనియన్లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యాక్షుడు ఐలి శ్రీనివాస్, నాయకులు బదావత్ శంకర్నాయక్, కొత్త త్యనారాయణరెడ్డి, వ వెంకటేశం అక్రమ్, పైడిపల్లి ప్రభాకర్, ఈ. కృష్ణ, కొంగర రవీందర్, ఆవుల రాములు, అంజయ్య, ఆడెపు శ్రీహరి, ఖాసీం, మురళీ,రాజారాం,మల్లికార్జున్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.