పెద్దపల్లి జంక్షన్ : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్పై మంత్రి ఆదివారం ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ను విజయవంతం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. వ్యాక్సినేషన్పై ఉన్న అపోహలను తొలగించాలని, గర్భిణులు కూడా కొవిడ్ టీకా తీసుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఊరూరా, వాడవాడలా వ్యాక్సినేషన్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని, ప్రతి మూడు కేంద్రాలను ఒక వైద్యాధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ తీరుపై హర్షం వ్యక్తం చేస్తూ వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని అభినందదించారు.
అనంతరం కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీతాసత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా కృషి చేస్తున్నామని, ఇందుకోసం జిల్లాలో 222 ( పట్టణాల్లో 118, గ్రామాల్లో 104) ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో దాదాపు 5. 5 లక్షల మందికి పైగా 18 ఏండ్లు నిండిన వారు ఉంటారని, వారిలో ఇప్పటివరకు 4,51,138 మందికి మొదటి డోసు వేశామని వివరించారు. సెప్టెంబర్ 17 నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్లో ప్రతిరోజూ 13 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా క్యాంపు లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఐకేపీ, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తిస్తున్నారని, అలాగే వ్యాక్సిన్ వేసుకున్న ఇంటికి స్టిక్కర్ను అతికిస్తున్నారని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, డీఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్కుమార్, రామగుండం మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్లు మమతారెడ్డి, పుట్ట శైలజ, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.