ఎదులాపురం,మే 25 : లాక్డౌన్ కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. మారుమూల గ్రామాల నుంచి రైతులు విత్తనాలు, ఇతర పనుల కోసం జిల్లా కేంద్రానికి వస్తున్నారని, వారికి జిల్లా పోలీసుల తరఫు నుంచి ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 3700 మందికి ఈ పాస్ ద్వారా అనుమతి పత్రాలు అందించినట్లు వివరించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా స్థానిక డీఎస్పీ దృష్టికి తీసుకురావాలన్నారు. వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకునే వారు ఫోన్లో తేదీ చూపించినా సరిపోతుందన్నారు. లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన 134 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీనివాస్రావు, ఏఆర్ ఎస్పీ బీ వినోద్ కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, ఉమా మహేశ్వరరావు, సురేశ్ ,సీఐలు, ఎస్ఐలు ఉన్నారు.
ఇబ్బందులకు గురిచేయవద్దు
లాక్డౌన్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులను కొన్నిచోట్ల పోలీసులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట అసొసియేషన్ పేర్కోంది. జిల్లా కేంద్రంలో ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్రను కలిసి సమస్యలు విన్నవించారు. విధి నిర్వహణలో భాగంగా సమాచార సేకరణకు వెళ్తున్న మీడియా సభ్యులను పికెట్ పాయింట్లు వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారని తెలిపారు. అక్రెడిటేషన్ కార్డు చూపిస్తున్నా ఆంక్షల పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. అక్రెడిటేషన్ కార్డు లేదా సంస్థ గుర్తింపు కార్డు కలిగి ఉన్న మీడియా సభ్యులను ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో అధ్యక్షుడు బేత రమేశ్, ప్రధాన కార్యదర్శి ఎల్ రాజుదత్తు, ప్రేమ్ సాగర్, శ్రీనివాస్, షాహిద్ మహబూబ్ ఖాన్, రాజేశ్, మోహిజ్ తదితరులు పాల్గొన్నారు.