ఆన్లైన్ క్లాస్లతో సెల్ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలకు అతుక్కుపోతున్న చిన్నారులు
పిల్లలు తప్పుదోవ పట్టకుండా జాగ్రత్త పడాలి
దుబ్బాక/మిరుదొడ్డి/ఆర్సీపురం/గుమ్మిడిదల: అభం శుభం తెలియని చిన్నారులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొన్ని పార్టీలు, శక్తులు చిన్నారులు, యువతను వారికి అనుకూలంగా మార్చుకొని విష రాజకీయం చేస్తున్నాయి. దీంతో సమాజంలో మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతున్నది. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ సెల్ఫోన్ అందుబాటులోకి రావడం, డేటా చౌకగా లభిస్తుండడంతో ప్రతి ఒక్కరూ ఎక్కువ సమయం ఆన్లైన్ గడుపుతున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్తో పాటు ఇతర సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో కనెక్ట్ అయి అన్ని అంశాలపై చర్చించడం,షేరు చేసుకోవడం చేస్తున్నారు .
ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఏడో తరగతి చదువుతున్న పిల్లవాడు సీఎం కేసీఆర్పై అసభ్య పోస్టింగ్లు పెట్టగా, సైబర్ క్రైం పోలీసుల విచారణలో విస్తుగొల్పే నిజాలు వెల్లడయ్యాయి. ఆ బాలుడుకి 9 జీమెయిల్ ఖాతాలు, 33 ఇన్స్టాగ్రాం ఖాతాలు, 15 ఫేస్బుక్ ఖాతాలు ఉండడం పోలీసును ఆశ్చర్యానికి గురి చేసింది. ఏడో తరగతి చదివే పిల్లాడికి ఇన్ని సోషల్ మీడియా ఖాతాలు ఉండడం కలవరానికి గురి చేస్తున్నది. మైనర్లపై పోలీసులు కేసులు పెట్టరనే ధీమాతో ఓ పార్టీ ఆ బాలుడి చేత ఇష్టారాజ్యంగా అసభ్యకర పోస్టులు సోషల్ మీడియాలో పెట్టిస్తూ విష రాజకీయం చేస్తున్నది పోలీసులు గుర్తించారు.
ఈ బాలుడే కాదు యువతను మత, ప్రాంతీయ, ఇతర అంశాలతో రెచ్చగొట్టి కొన్ని పార్టీలు సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా, అసభ్యకర పోస్టులు పెట్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసం సమాజంలో విష బీజాలను నాటుతున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. తమ పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతుండాలి. వారు హద్దు దాటకుండా జాగ్రత్తపడాలి. వారు సెల్ఫోన్తో ఏమి చేస్తున్నారు. వారి సోషల్ మీడియా ఖాతాలను చెక్చేస్తూ ఉండాలి. పిల్లలు ఎక్కువ సమయం సెల్ఫోన్తో గడపకుండా జాగ్రత్త పడాలి. చెడు స్నేహలు పట్టి దారితప్పకుండా చూపుకోవాలి.
సంఘవిద్రోహ చర్య కిందికి తీసుకోవాలి..
చిన్నపిల్లలతో అసభ్య పోస్టింగులు పెట్టించడాన్ని సంఘవిద్రోహ చర్య కిందికి తీసుకోవాలి. ఆర్థికంగా వెనుకబడి, తల్లిదండ్రుల సహకా రం లేని అనాథ, అమా యక పిల్లలు రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో అ సాంఘిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తు న్నారు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో మైనర్లు ఏమి చేసినా చెల్లుతుందని చూపిస్తుండడంతో దురుద్దేశం తో స్వార్థరాజకీయం కోసం రాజకీయ నాయకులు వాళ్ల ను వాడుకుంటున్నారు. పేద, ధనిక అని తేడా లేకుండా ప్రతి పిల్లవాడి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటున్నది. పిల్లల ఫోన్ వాడకాన్ని తగ్గిస్తూనే ఎప్పటికప్పుడు వారిపై తల్లి దండ్రుల పర్యవేక్షణ ఉండాలి. చిన్నపిల్లలతో సైబర్ నేరా లు చేయిస్తుంది ఎవరనేది కనిపెట్టి, అలాంటి రాజకీయ నాయకుడికి శిక్ష విధిస్తే మిగతా వారు భయపడుతారు. అప్పుడు ఇలాంటివి పునరావృతం కావు.
తప్పుచేస్తే శిక్ష తప్పదు…
నేరం చేసే వారు ఎవరైనా సరే శిక్షలు ఒకేరకంగా ఉంటాయని పోలీసులు తెలుపుతున్నారు. పిల్లలు కదా ఎవరూ పట్టించుకోరనుకొంటే పొరపాటే అని వారంటున్నారు. ఉద్దేశపూర్వకంగా, నేరమయ బుద్ధితో చేసే అంశాలలో పిల్లలు, పెద్దలకు తేడా ఉండదని, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను పోస్టుచేస్తే మూడేండ్ల వరకు జైలు శిక్ష పడుతుందని తెలిపారు. పిల్లలు తెలిసీతెలియని వయస్సులో కొత్తవారితో పరిచయాలు చేసుకోవడం ద్వారా లేనిపోని వాటికి ఆకర్షితులవుతుంటారని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది మంచో, ఏది చెడో చెప్పాలని, పిల్లలు ఏంచేస్తున్నారనే విషయాలు తల్లిదండ్రులకు తెలియడం లేదని, బాలుడు మార్ఫింగ్ ఫొటోలు పెట్టడంతో నోటీసులు జారీచేసినట్లు పోలీసులు తెలిపారు.
హీరోయిజంగా భావించి…
కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ కుటుంబానికి చెందిన ఓ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ తరగతులు కావడంతో తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్ కొనిచ్చారు. వాస్తవానికి బాలుడి తండ్రిగానీ కుటుంబంలోని ఇతర సభ్యులు గానీ ఏ పార్టీకీ చెందినవారు కాదు. కనీసం సానుభూతిపరులు కూడా కాదు. సాంకేతిక అంశాల్లో సదరు బాలుడు చురుకుగా ఉన్నట్లు గుర్తించిన స్థానిక బీజేపీ నేతలు అతడిని తప్పుదోవ పట్టించారని తెలుస్తున్నది. సీఎం కేసీఆర్పై అసభ్యకర పోస్టింగులు చేసేలా ప్రోత్సహించడం, అందుకు బీజేపీ సోషల్ మీడియా విభాగం పూర్తి సహకారం అందించడంతో ఆ పని.. సదరు బాలుడికి ఓ వ్యాపకంగా మారిపోయిందంటున్నారు.
తల్లిదండ్రులకు తెలియకుండా అదేపనిగా సీఎం కేసీఆర్కు సంబంధించి మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను పోస్ట్చేస్తున్నాడు. రాజకీయంగా సీఎం కేసీఆర్ను గానీ ప్రభుత్వ విధానాలను కానీ రాజకీయ నాయకుల, ఆ అంశాలపై అవగాహన ఉన్నవారో విమర్శించడం రాజకీయ స్వేచ్ఛ అనుకోవచ్చు. కానీ.. కేసీఆర్ అంటే ఎవరో.. ఆయన చేసిన పోరాటం ఏమిటో.. చేస్తున్న పరిపాలన ఎలాంటిదో కనీస అవగాహన కూడా లేని ఓ చిన్నపిల్లగాడు.. ఇలా వ్యక్తిగతంగా అసభ్యకర మార్ఫింగ్ వీడియోలు.. అందునా ఏ మాత్రం సంబంధం లేనివి పెట్టడం, వాటిని రాష్ట్ర బీజేపీ నేతలు, వారి సోషల్ మీడియా వారు ట్రోల్ చేయడం అనేక సందేహాలకు తావిస్తున్నది. తన పోస్టులను రాష్ట్ర బీజేపీ శ్రేణులు ట్రోల్ చేస్తుండటంతో సదరు బాలుడు తాను చేస్తున్న పనిని హీరోయిజంగా భావించాడు.
పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఉండాలి..
పిల్లలపై తల్లిదండ్రుల నిఘా తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ప్రతీ పిల్లాడి చేతులో మొబైల్ ఫోన్ కనిపిస్తున్నది. వాళ్లు ఫోన్లో ఏమి చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. పిల్లలకు రాజకీయాల మీద అవగాహన ఉండదు. పిల్లలకు గేమ్స్, చదువుపైనే ఆసక్తి ఉంటుంది. మైనర్లతో సైబర్ నేరాలు
చేయించాలనుకునే వాళ్లే పిల్లల పేరిట ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ట్వీటర్, జీమెయిల్ ఖాతాలు తెరిచి, అసభ్య పోస్టింగులకు పాల్పడుతున్నారు.
14ఏండ్ల బాలుడు అసభ్య పోస్టింగులు చేశాడంటే అది ఆ బాలుడి పనికాదు. పెద్దవాళ్లు ఎవరో చేసి, బాలుడిని తెర మీదికి తెచ్చారన్నమాట. రాజకీయ
నాయకులైనా, సైబర్ నేరగాళ్లయినా ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం.
ఆన్లైన్ క్లాసులపై ఓ కన్నేయాలి..
కరోనాతో విద్యాసంస్థలు మూతబడి ఆన్లైన్ క్లాస్లు నడుస్తుండడంతో పిల్లలు సెల్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ల ద్వారా క్లాస్లు వింటున్నా రు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెట్టాలి. సెల్ఫోన్లు, కంప్యూటర్లలో విద్యార్థులు కేవలం ఆన్లైన్ క్లాస్లు వింటున్నా రా, లేదా ఇతర వ్యాపకాల్లో మునిగిపోతున్నారా అనేది గమనించాలి. వారు సోషల్ మీడియాలో గడపకుండా, అంతేకాకుండా అశ్లీల వీడియోలు చూడకుండా కన్నేసి పెట్టాలి. అంతేకాకుండా సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడం, రెచ్చగొట్టే పోస్టులు పెడితే సమాజంలో జరిగే పరిణామాలను పిల్లలకు తల్లిదండ్రులకు తెలియజేసి వారు అలా చేయకుండా చూడాలి. జాగ్రత్తలు తప్పనిసరి పిల్లలు ఏమి చేస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలి.తల్లిదండ్రులు పిల్లలతో సున్నితంగా మెలగాలి. కఠినంగా ఉండటం అనర్థాలకు దారితీస్తుంది.
ఉపాధ్యాయులు ఏది మంచి.. ఏది చెడు అన్న అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి. సెల్ఫోన్లు, ల్యాప్టాప్లతో ఎక్కువ సమయం గడపడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటి గురించి పిల్లలకు తెలియజేయాలి. మైనర్ పిల్లల ఇంటర్నెట్ వాడకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గనిర్దేశం చేయాలి. ఇతరులను కామెంట్ చేయడం, వ్యక్తులను, వ్యవస్థలను కించపరిచే ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్చేస్తే చర్యలుంటాయని పిల్లలకు అవగాహన కల్పించాలి. సోషల్మీడియా వైపు పిల్లలు ఆకర్షితులు కాకుండా చూసుకోవాలి. నేరాలు చేయడంతో జరిగే నష్టాలను పిల్లలకు వివరించాలి. రాజకీయాలు, మతపరమైన అంశాలు, వ్యక్తులను కించపరిచేలా పోస్టులు పెట్టడం, కామెంట్లు చేయడం నేరమని పిల్లలకు చెప్పాలి.
ఇంటర్నెట్ ద్వారా కొత్తవారికి పిల్లలు ఆకర్షితులు కాకుండా జాగ్రత్తపడాలి. మైనర్లకు వాహనాలు ఇవ్వడంతో జరిగే అనర్థాలకు.. పోలీసులు వారి తల్లిదండ్రులను బాధ్యులను చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పిల్లలుచేసే అసభ్యకర చేష్టలకు తల్లిదండ్రులను బాధ్యులను చేసే పరిస్థితులు వచ్చాయి. ఆన్లైన్ క్లాసులు కావడంతో ప్రతి ఇంట్లో పిల్లలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. నిన్నటిదాకా ఇది సైబర్ నేరగాళ్లకు వరంగా మారితే.. ఇప్పుడు రాజకీయ, మతఛాందసవాదులు, సంఘ వ్యతిరేక శక్తులకు అనుకూలంగా తయారైంది. పిల్లల్లో విషబీజాలు నాటుతూ వారిద్వారా తమ భావజాలాన్ని సమాజంలోకి చొప్పిస్తున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే తప్ప ఇలాంటి రాజకీయ సైబర్ బూచాళ్ల నుంచి పిల్లల్ని కాపాడుకోలేకమని నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు.