తొమ్మిదేండ్ల నుంచి అధికారానికి దూరంగా ఉండటంతో కాంగెస్ పార్టీ నాయకుల వద్ద ఇప్పుడు మొబైల్ రీచార్జింగ్కు కూడా డబ్బులు లేవంటే, అయ్యో పాపం అని ఎవరికైనా జాలేస్తుంది. ఇది ఒక్క రాష్ట్ర నాయకులదే కాదు, అధిష్ఠానం నేతలదీ అదే పరిస్థితి అంటే ఆశ్చర్యపోక తప్పదు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల నుంచి తనకు ఈ మధ్య మిస్డ్ కాల్స్ వస్తున్నాయని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల బయటపెట్టారు.
గతంలో కూడా ఇలాగే తనకు ప్రధాని మోదీ ఫోన్ చేసినట్టు ఆమె చెప్తే అలాంటిదేమీ జరగలేదని బీజేపీ నేతలు ఖండించారు. అయితే కాంగ్రెస్ మిస్డ్ కాల్స్ వ్యవహారం మాత్రం కాస్త నమ్మబుల్గా ఉందంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. మూడు, నాలుగు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు తాను సీఎంగా ఉన్నా, లేకపోయినా ఆ సీట్లో ఎవరున్నా… ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు సీఎం హెలికాప్టర్లో క్షణాల్లో వాలిపోయే లెవల్లో ఉంటానని కార్యకర్తలకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన బర్త్ డే సందర్భంగా భరోసా ఇచ్చారు. కోమటిరెడ్డి కూడా మిస్డ్ కాల్స్ గురించి చెప్పడంతో షర్మిల చెప్పినదాంట్లో కూడా నిజం ఉన్నట్టుందని ప్రజలు అనుకుంటున్నారు.