ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాం. నవజాత శిశువుల సరైన అభివృద్ధికి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తల్లిపాల కంటే మెరుగైన ఆహారాన్ని తయారు చేయలేక పోయింది. అందుకే తల్లిపాల విశిష్టతను వివరిస్తూ ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు.
WABA (World Alliance for Breast feeding Action ) అనే సంస్థ ఆధ్వర్యంలో WHO, UNICEF, IBFAN (International Baby Food Action Network) & BPNI (Breast feeding promotion NetWork of India) తదితర సంస్థలు ఈ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఏటా ఒక్కో థీమ్తో ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఈ ఏడాది‘తల్లి పాలివ్వడం బిడ్డకు ఆటంకం కారాదు.(Lets make breastfeeding and work, work!) అనే థీమ్తో వారోత్సవాలు జరుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 దేశాలు 1991 నుంచి క్రమం తప్పకుండా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నా యి. తల్లులు శిశువు పుట్టిన ఒక గంటలోపు నుంచే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలి. తల్లులు మొదటి 6 నెలలు వరకు పిల్లలకు తప్పకుండా తల్లిపాలు ఇవ్వాలి. శిశువుకు 2 సంవత్సరాల వయస్సు వరకు పాలను కొనసాగిస్తూనే సురక్షితమైన ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేయాలి.అయితే భారతదేశంలో కేవలం 42 శాతం మంది తల్లులు మాత్రమే బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు తాగిస్తున్నారు. 55 శాతం మంది మాత్ర మే బిడ్డకు ఆరునెలల పాటు తల్లిపాలు తాగిస్తున్నారు.
పౌష్టికాహార లోపంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు పది మిలియన్ల మంది చిన్నారులు ఐదు సంవత్సరాలలోపు వయస్సులోనే మరణిస్తున్నారు. అందులో నాలుగు మిలియన్ల మంది చిన్నారులు పుట్టిన 28 రోజుల్లోనే మరణిస్తున్నారు. ఇక సంవత్సరంలోపు మరణాలు ముఖ్యంగా విరేచనాలు, శ్వాసకోశ వ్యాధుల వల్ల సంభవిస్తున్నాయి. శిశువు జన్మించిన గంటలోపే ముర్రు పాలు పట్టడం వల్ల దేశంలో ఏడాదికి రెండున్నర లక్షలమంది చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు తేల్చి చెప్తున్నారు. తల్లి ప్రసవం అయిన వెంటనే ఆమె స్తనాల నుంచి ప్రథమంగా కొలస్ట్రం అనే పసుపురంగు చిక్కటి పాలు వస్తాయి. వీటిని ముర్రుపాలు అంటారు. అవి బిడ్డకు అమృతంతో సమానమైనవి. ఒకరకంగా జీవితకాలం పని చేసే టీకా అని చెప్పవచ్చు. ఇవి పసికందు మెద డు చురుకుగా పని చేయడంతోపాటు జ్ఞాపక శక్తి పెరిగేందుకు దోహదపడుతాయి. గుండె, చర్మ, సంబంధ వ్యాధులు, ఉబ్బ సం, ఆస్తమా, బీపీ, షుగర్ రాకుండా చేస్తాయి. ఆరునెలల పాటు శిశువుకు రోజుకు 12 సార్లు పాలు తాగించాలి. ఈ పాలు తాగిన పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ముర్రుపాలతో మొదటగా విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు పచ్చకామెర్లు కలిగించే బైబిరూబిన్ అనే పదార్థం కూడా విసర్జించబడి మొదటి వారం కలిగే పచ్చకామెర్ల తీవ్రత తగ్గుతుంది. ఈ పాలలో విటమిన్ ఏ అధిక మోతాదులో ఉండడం వల్ల శిశువు కళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయి. ఆరు నెలల వరకు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. నీళ్లు, తేనె, గ్లూకోజ్ నీరు, జంతువుల పాలు, బయటిపాలు ఏవీ ఇవ్వరాదు. దానివల్ల విరేచనాలు అవుతాయి. అంటు వ్యా ధులు సోకుతాయి. ఆరు నెలలపాటు తల్లిపాలివ్వడం వల్ల శిశువుకు శారీరక పుష్టి మాత్రమే కాక తల్లితో అనుబంధం ఏర్పడుతుంది. వేసవికాలంలో కూడా తల్లిపాలలో శిశువుకు కావలసినంత నీరు, పుష్టి కలిగించే పదార్థాలు ఉంటా యి. అందువల్ల తల్లి శిశువుకు విడిగా నీరు తాగించవలసిన అవసరం లేదు.
శిశువు సంపూర్ణ మానసిక వికాసానికి గాను రెండేండ్ల వయసు వచ్చే వరకు తల్లిపాలు తాగించాలి. శిశువుకు జబ్బు చేసినప్పటికీ తల్లిపాలు తాగించాలి. దాని వల్ల శిశువులో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తల్లి అనారోగ్యంగా ఉన్నప్పటికీ శిశువుకు తల్లిపాలు తాగించవచ్చు.
తల్లిపాలు శిశువుకు ప్రకృతి సహజ సిద్ధమైనవి, సురక్షితమైనవి, పుష్టికరమైనవే కాక సంపూర్ణ ఆహారం. అమృతతుల్యమైన తల్లిపాలు శిశువుకు రోగనిరోధక శక్తి ని కలిగిస్తాయి తల్లిపాలలో ఉన్న ఇమ్యునోగ్లోబ్లిన్ యాంటీబాడీస్ వలే పనిచేసి శిశువుకు రోగాలతో పోరాడే శక్తినిస్తుంది. తల్లిపాలు సులభంగా జీర్ణమై త్వరగా శరీరంలో శోషించబడుతాయి. తల్లి స్తనాలను చీకటం ద్వారా శిశువు దవడలు దృఢంగా, దంతాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. తల్లి పాలు తాగే సమయంలో తల్లి నుంచి శిశువుకు స్పర్శ ద్వారా వెచ్చదనం లభిస్తుంది. బిడ్డకు చక్కటి శారీరక, మానసిక, సాంఘిక, ఆరోగ్య అభివృద్ధికి తల్లిపాలు గట్టి పునాది. తల్లి శరీరంలోని ప్రమాదకర బ్యాక్టీరియా బిడ్డ శరీరంలోకి చేరినా కీడు చేయకుండా తల్లిపాలు నిరోధిస్తాయి. తల్లిపాలలో ఉన్న ప్రోటీన్స్, ఫ్యాట్, క్యాల్షియం తొందరగా గ్రహించబడతాయి. శిశువులను విరేచనాలు నిమోనియా నుండి రక్షిస్తాయి. అలర్జీ, చెవిలో ఇన్ఫెక్షన్లు నివారించడానికి దోహదపడతాయి.
శిశువుకు పాలివ్వడం వలన తల్లికి మానసిక తృప్తి లభిస్తుంది. శిశువు పట్ల గాఢమైన ప్రేమ ఏర్పడుతుంది. తల్లి పాలు అధికంగా తాగించటం వల్ల తల్లుల్లో పాల ఉత్పత్తి అధికమవుతుంది. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. త్వరగా గర్భవతి కాకుండా కాపాడి ఒక విధంగా గర్భ నిరోధకంగా పనిచేస్తుంది. బిడ్డల మధ్య వ్యవధి పాటించగల్గుతారు. బిడ్డ తల్లి రొమ్ము స్పృశించి చీకడం వలన ఆక్సీటోసిన్ అనే పదార్థం తల్లి శరీరంలో విడుదల అవుతుంది
దీని వల్ల రక్తస్రావం నిలిచిపోయి తల్లి గర్భాశయం కుంచించుకుపోయి యథాస్థానంలోకి వస్తుంది. తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు పెరిగిన అదనపు బరువును తల్లిపాలు ఇవ్వడం వల్ల తగ్గిస్తుంది. తల్లికి రక్తహీనత, ఎముకల బలహీనత నుం డి రక్షణ కలిగిస్తుంది. కనుక తల్లిపాలు తల్లీబిడ్డలిద్దరికీ ఆరోగ్యాన్ని అందించే అమృతం.
( వ్యాసకర్త : ఇందల్వాయి పీహెచ్సీ ఆరోగ్య విస్తరణాధికారి)
– యెనుగందుల శంకర్