Women’s Reservation Bill ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా ప్రజల ఎజెండాను చర్చించాలి కాని పాలకుల ఎజెండాను కాదు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. కానీ దేశ జనాభాలో సగ భాగం ఉన్న మహిళలకు ఇప్పటికీ చట్టసభల్లో తగినంత ప్రాతినిధ్యం లేదు. దశాబ్దాలుగా మహిళా లోకం చేస్తున్న పోరాటాలకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. దీనివెనుక బీఆర్ఎస్ పార్టీ, భారత జాగృతి సంస్థల కృషి ఎంతో ఉన్నది.
కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతున్న ప్రత్యేక సమావేశాల్లో ‘నారీశక్తి వందన్ అధినియం’ పేరుతో కేంద్రం చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడం హర్షణీయం. దేశాన్ని ఇప్పటిదాకా పాలించిన పార్టీలేవీ మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం చిత్తశుద్ధితో పనిచేసిన దాఖలాలు లేవనే చరిత్ర చెప్తున్నది. 2010లో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందినా లోక్సభలో మాత్రం వీగిపోయింది. అప్పటినుంచి దేశవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం పోరాటం చేసే సంస్థలు, కార్యకర్తలు మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకోసం పోరాడుతూనే ఉన్నారు. అయితే మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయటానికి చైతన్యశీలమైన పాత్రను పోషించిన తెలంగాణ జాగృతి భారత జాగృతిగా రూపాంతరం చెందిన తర్వాత మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఢిల్లీ వేదికగా ఆందోళనకు శ్రీకారం చుట్టిం ది. సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన ఈ ధర్నా దేశ నేతలందరి దృష్టిని ఆకర్షించింది. మహిళలు తమ రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలనే భావనను కవిత దేశవ్యాప్తంగా కలిగించారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సోనియాగాంధీ మొదలుకొని అన్నిపక్షాల నాయకురాళ్లంతా ముందుకురావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆమె ఇచ్చిన పిలుపు మేరకే మహిళల రిజర్వేషన్ల బిల్లుకు బాటలు వేసింది! ఇది దేశ రాజకీయ చరిత్రలో అపూర్వమైన ఘట్టం!
తమకు అవకాశం లభించిన అన్నిరంగాల్లో భారత మహిళలు ప్రతిభా సామర్థ్యాలను రుజువు చేసుకుంటూనే ఉన్నారు. కానీ చట్టసభల్లో వారికి తగినంత ప్రాధాన్యం లభించకపోవడం హేయనీయం. అందుకే కనీసం మూడో వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేసినప్పుడే తగిన ప్రాతినిధ్యం లభిస్తుంది.
మహిళలకు ప్రాతినిధ్యం పెరిగితే చట్టసభ చర్చలు మరింత అర్థవంతంగా జరుగుతాయి. ఇదే సందర్భంలో భారత జాగృతి అధ్యక్షు రాలు కవిత డిమాండ్ చేసినట్టుగా చట్టసభల్లో సీట్ల సంఖ్యను పెంచాలి. విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను కూడా పెంచాలి. ()
– వ్యాసకర్త: విద్యారంగ నిపుణులు పీఎల్ అలేఖ్య