కాంగ్రెస్ మార్కు పరిపాలనను వివరించాలంటే ‘ముసలి పులి-బంగారు కడియం’ కథ చక్కగా సరిపోతుంది. సొత్తు కోసం ఆశపడితే అంతే సంగతులు. పులి నోటికి చిక్కి విలవిలలాడటం తప్ప మరేమీ ఉండదు. కర్ణాటక ఐదు గ్యారెంటీలు అష్ట వంకర్లు తిరుగుతున్న రోజుల్లోనే తెలంగాణ కాంగ్రెస్ ఒకటి ఎక్కువ చేర్చి ఆరు గ్యారెంటీలు, మొత్తం 420 హామీలంటూ ఊదరగొట్టింది. వాటి అమలు సాధ్యం కాదని అప్పట్లోనే విజ్ఞులు ఎంతగానో చెప్పజూశారు. కానీ దశాబ్దం కాలంగా అధికారానికి దూరమై పరితపిస్తున్న కాంగ్రెస్ అందలం కోసం అరచేతిలో స్వర్గం చూపింది. గెలిస్తే కదా అప్పుడు చూద్దాం అనుకున్నారో లేక గెలిచిన తర్వాత షరామామూలుగా మొండిచెయ్యి చూపుదామనుకున్నారో తెలియదు. అడ్డగోలు హామీలతో, మాయదారి మాటలతో కాంగ్రెస్ మొత్తం మీద అధికారంలోకి రాగలిగింది. లెక్కాపత్రం అప్పుడు చూసుకోకుండా ఇచ్చిన హామీల అమలు మెడకు ఓ గండంలా తయారైంది. దాంతో సాకులు వెతికే పనిలో పడ్డారు సర్కారు పెద్దలు.
ముందుగా గత సర్కారు మీద అభాండాలు వేసే పని మొదలుపెట్టారు. లంకెబిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ ఖజానా తమ చేతికి వచ్చిందని బీద అరుపులు అరిచారు. హామీలు ఇచ్చినప్పుడు అందరికీ వర్తిస్తాయన్నట్టుగా నమ్మబలికారు. తీరా అమలుచేయాల్సి వచ్చేసరికి మాట మార్చారు. సవాలక్ష నిబంధనలు పెట్టారు. చివరికి తెల్లరేషన్ కార్డు ఉంటేనే గ్యారెంటీలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చాలామందిని గ్యారెంటీల పరిధిని తప్పించేందుకు ఈ పాట ఎత్తుకున్నారనేది చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. పదేండ్లుగా కార్డు రానివారు, లేనివారు ఎందరో ఉన్నారు. పెద్ద కుటుంబాలు విడిపోయినప్పుడు అందరికీ కార్డులు రాలేదు. పైగా తెల్లకార్డుల జారీకి సవాలక్ష నిబంధనలు ఉంటాయనేది తెలిసిందే. ఆ నిబంధనలు విధించడం వెనుక గల ఉద్దేశమూ తెలిసిందే. సాధారణ పథకాల లబ్ధి అనేది నిజంగా నిరుపేదలకే అందాలనే ఉద్దేశంతో తెచ్చిన నిబంధనలవి. హామీల అమలుపై విమర్శలు వెల్లువెత్తుతుంటే ఇప్పుడు పేదరికానికి కొత్త నిర్వచనం లేదా కొలమానం కావాలని సీఎం రేవంత్రెడ్డి సరికొత్త పాట ఎత్తుకుంటున్నారు. హామీలపై కాంగ్రెస్ సర్కారు వేస్తున్న కుప్పిగంతులు, వెతుకుతున్న కంటిసాకులు ప్రహసనాన్ని తలపిస్తున్నాయి.
ఇక అదివరకే అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంలోనూ పూటకోమాట అనేది కాంగ్రెస్ విధానంగా మారింది. ఎన్నికల ముందు రైతుబంధు సొమ్ము ఖాతాల్లో పడకుండా అడ్డుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నాలిక మడతేయడంలో రికార్డు సృష్టిస్తున్నది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దీనిపై కనీసం నాలుగుసార్లు మాట మార్చారు. 50 రోజుల్లో 5 సార్లు మాటమార్చడం ఆయనకే చెల్లింది. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఇప్పుడేమో ఉద్యోగుల జీతాలు వేస్తున్నందువల్లే రైతుబంధు ఆలస్యమైందని చావుకబురు చల్లగా సెలవిచ్చారు. ఎల్ఆర్ఎస్ మీద కూడా విపక్షంలో ఉన్నప్పుడు ఒక్కమాట, అధికారంలోకి వచ్చినాక మరొకమాట.. ఇలా రెండునాల్కలతో మాట్లాడటం కాంగ్రెస్కే చెల్లింది. ఫ్రీ అన్న నోటితోనే ఫీజు కట్టమంటున్నారు. కుంటిసాకులతో తప్పించుకోవడం అంతకంతకూ ఇబ్బందికరంగా మారుతుండటంతో సర్కారులో నిస్పృహ కనిపిస్తున్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకోవడం సాధ్యం కావడం లేదు. ప్రతిపక్షం నిలదీస్తే పనికిమాలిన సవాళ్లతో దృష్టి మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలూ బెడిసికొడుతున్నాయి. ప్రభుత్వం సాకులు వెతికే పని మానుకొని ఇచ్చిన హామీల అమలుకు సరైన ప్రణాళికతో ముందుకు సాగితే మంచిది.