మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలి పార్లమెంట్ నియోజకవర్గాలు నెహ్రూ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్నాయి. ఫిరోజ్గాంధీ నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ, రాజీవ్, సోనియా, రాహుల్ వరకు ఆ కుటుంబానికి చెందిన నేతలందరూ ఆ స్థానాల నుంచి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించారు. అయితే కాంగ్రెస్ అగ్రనాయకుల ఒకప్పటి కంచుకోటలు బద్దలయ్యాయా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆ రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించకపోవడమే అందుకు నిదర్శనం. మరోవైపు రాయ్బరేలి సిట్టింగ్ ఎంపీ సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.
హస్తం పార్టీ కంచుకోటలైన అమేథీ, రాయ్బరేలి నుంచి నెహ్రూ కుటుంబానికి చెందినవారు పోటీలో నిలుస్తారా? లేదా? అనేది ఇప్పటికీ తేలలేదు. దీంతో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్న అధికార బీజేపీ.. కాంగ్రెస్ను ఇరుకున పడేస్తున్నది. క్యాడర్లో నూతనోత్సాహం నింపాల్సిన నాయకత్వమే వెనుకడుగు వేస్తుండటంతో కార్యకర్తలు నైరాశ్యంలోకి కూరుకుపోతున్నారు.
మరోవైపు ఈ రెండు స్థానాల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. వయనాడ్లో రాహుల్గాంధీ ఓటమిని ఊహించిన ఆ పార్టీ అమేథీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. వ్యతిరేకత ఎక్కువగా ఉన్నందున పోటీకి దూరంగా ఉండాలని కేరళ సీఎం విజయన్.. రాహుల్కు సూచించినట్టు తెలుస్తున్నది. విజయన్ సూచనలను రాహుల్గాంధీ పెడచెవిన పెట్టడంతో ఈ సీటును విజయన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బలమైన అభ్యర్థి అన్నీ రాజాను బరిలో దించడంతో రాహుల్గాంధీ ఎదురీదుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా తన బలాన్ని చాటుకునేందుకు రాష్ట్ర అధ్యక్షుడు కే.సురేంద్రన్ను బరిలోకి దించింది.
ఈ పరిణామాల మధ్య వయనాడ్లో ఓటమి ఎదురయ్యే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ రాహుల్ను అమేథి నుంచి కూడా బరిలో దించాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రత్యామ్నాయంగా అమేథీని ఎంచుకున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా సమాజ్వాదీ పార్టీ మద్దతు కూడగట్టుకొని అమేథీపై మరోసారి పట్టు సాధించాలని, తద్వారా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకురావాలని రాహుల్ యోచిస్తున్నారు. సోనియా ఖాళీ చేసిన రాయ్బరేలి నుంచి ప్రియాంకా వాద్రాను పోటీ చేయించాలని నిర్ణయించారు. అమేథీ అభ్యర్థిని ప్రకటించకుండా రాయ్బరేలి అభ్యర్థి పేరును ప్రకటిస్తే అనుమానం వస్తుందనే కారణంగానే ముందుగా ప్రకటించలేదు.
ఈ వ్యూహం వెనుక ఉన్న మతలబు ఏంటంటే.. ఒకవేళ ముందస్తుగానే రెండుచోట్ల రాహుల్ పేరును ప్రకటిస్తే మొదటికే మోసం వస్తుంది. అమేథీలో మరోసారి రాహుల్ పోటీ చేస్తున్నారని తెలిస్తే వయనాడ్లో కాంగ్రెస్ కార్యకర్తలు డీలా పడిపోతారు. ‘అమేథీలో ఎలాగూ పోటీ చేస్తున్నారు. ఒకవేళ వయనాడ్లో రాహుల్ను గెలిపించినా రాజీనామా చేసి వెళ్లిపోతారు’ అనే ప్రచారం జోరందుకుంటే ప్రజలు తిరస్కరించే ప్రమాదమూ లేకపోలేదు. ఈ విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్.. కేరళలో ఏప్రిల్ 26న పోలింగ్ ముగిసిన వెంటనే రాయ్బరేలి, అమేథీ స్థానాల అభ్యర్థులను ప్రకటించాలని యోచిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అమేథీతో పాటు వయనాడ్లోనూ రాహుల్గాంధీ ఓడిపోతే మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఖాయం.
-రాకేశ్ కందుకూరి
91006 42346