తాను తీసుకొచ్చిన ఓ గొప్ప ఆవిష్కరణ పక్కదారిపట్టి మానవాళికి కొత్త కష్టాలను తీసుకొస్తుంటే.. ఏ శాస్త్రవేత్త కూడా భరించలేడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమమేధ-ఏఐ) పితామహుడు జాఫ్రీ హింటన్ దీనికి మినహాయింపేమీ కాదు. అది 1888వ సంవత్సరం. ఏప్రిల్ పదమూడో తేదీ. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ తన సోదరుడు మరణించిన బాధలో ఉన్నారు. అంతలో అతని సహాయకుడు ఆరోజు ఫ్రెంచ్ పత్రికలన్నింటినీ పట్టుకొచ్చి చూపించాడు. అందులో ‘ప్రజల చావులతో వ్యాపారం చేసిన బిజినెస్మ్యాన్ చనిపోయాడు’ అని రాసి ఉంది. సోదరుడు చనిపోతే, తాను చనిపోయినట్టు పొరబడిన పత్రికలు అలా రాశాయని తెలుసుకోవడానికి ఆల్ఫ్రెడ్కు ఎంతో సమయం పట్టలేదు. అయితే, ఆ వార్తల్లోని ఒక్కో అక్షరం చదువుతుంటే అతని కండ్లు చెమ్మగిల్లాయి.
‘నిర్మాణ రంగం, గనుల తవ్వకాల కోసమని తాను కనిపెట్టిన డైనమైట్.. చివరకు మానవాళి వినాశనానికి, యుద్ధాలకు కారణమవుతున్నది కదా!’ అని అర్థం చేసుకొన్న ఆల్ఫ్రెడ్ అప్పుడే ఓ దృఢ నిర్ణయం తీసుకున్నారు. మానవాళికి ఉపయుక్తంగా ఉండే ఆవిష్కరణలకు పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ ప్రైజ్ ప్రారంభం కావడం వెనుక దాగిఉన్న కథ ఇది.
సాంకేతిక రంగంలో ఏఐ ఎంతటి సంచలనాలను సృష్టిస్తున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఏఐతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అదేస్థాయిలో ప్రతికూలతలూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడి నుంచి సినీ నటుల వరకు ఏఐ డీప్ఫేక్ల బారినపడి ఇబ్బందులు పడినవారే. ఏఐ కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు కూడా. ఏఐ సాంకేతికతలో వస్తున్న నూతన ఒరవడులు 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపించవచ్చని అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ గోల్డ్మన్ శాక్స్ హెచ్చరించింది.
సామాన్యులను ఆదుకోవాలి: ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతుండటంపై ఏఐ పితామహుడు డాక్టర్ జాఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ రాకతో కంపెనీలు లాభాల బాట పట్టి ధనికులు మరింత సంపన్నులుగా మారుతుండగా.. ఉద్యోగాలు కోల్పోయి సామాన్యులు రోడ్డున పడిపోయే దుస్థితి వాటిల్లుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం సమాజానికి ఏ మాత్రం మంచిదికాదని హెచ్చరించారు. అందుకే దేశాలన్నీ ‘యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్’ (యూబీఐ) పాలసీని తీసుకురావాలని ఆయన నొక్కిచెప్పారు.
మానవాళికే ముప్పు: బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏఐ సాంకేతికతపై జాఫ్రీ హింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కంపెనీల ఉత్పాదకత పెరిగి తద్వారా దేశాల ఆర్థిక స్థితిగతులు మెరుగవడానికి ఏఐ సాయపడుతుందని తొలుత సంతోషించా. అయితే, ఏఐ సాయంతో కంపెనీల యజమానులు మరింత సంపన్నులుగా మారుతున్నారు. అదే సమయంలో ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఇది సమాజంలో అసమానతలకు కారణమవుతున్నది. వచ్చే 5-20 ఏండ్లలో మొత్తం ఉద్యోగాల్లో సగానికి పైగా ఏఐ సాంకేతికతే ఆక్రమిస్తుంది. ఏఐతో ఉద్యోగాలే కాదు, మానవాళికి కూడా ముప్పు పొంచి ఉన్నది. ఇది మన మేధస్సును దాటుకొని విస్తరించవచ్చు. తనకు తానుగా ఆలోచించే స్థాయికి ఏఐ చేరుకోవచ్చు. అదే జరిగితే, మానవాళి ఉనికే ప్రశ్నార్థకమవుతుంది’ అని హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు.
అప్పుడు నోబెల్.. ఇప్పుడు హింటన్: డైనమైట్ ఆవిష్కరణ ద్వారా ఆయుధాలు, ఆయిల్ తదితర వ్యాపారాలు చేసి విపరీతంగా లాభాలు గడించిన ఆల్ఫ్రెడ్ నోబెల్.. చివరకు తన ఆవిష్కరణ మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుండటాన్ని చూసి చలించిపోయారు. తన సంపదలో మెజారిటీ భాగాన్ని పక్కన పెట్టిన ఆయన.. దాని మీద వచ్చే వడ్డీని నోబెల్ ప్రైజ్ల రూపేణా మానవాళికి అత్యంత మేలు చేసే ఆవిష్కర్తలకు పంచాల్సిందిగా వీలునామా రాశారు. తన ఆవిష్కరణల ద్వారా పురుడుపోసుకొన్న ఏఐ.. మనిషి ఉపాధినే మింగేసే స్థాయికి చేరుకోవడాన్ని భరించలేని హింటన్ ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను ప్రపంచానికి తెలియజేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ‘యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్’ పాలసీ కోసం యూకే, యూఎస్ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు.
ఏమిటీ ‘యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్’?: దేశంలోని వయోజనులందరికీ ప్రతీనెలా బ్యాంకు ఖాతాలో కనీస మొత్తంలో ప్రభుత్వం డబ్బును జమ చేయాలి. దీన్నే ‘యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ (యూబీఐ)’గా పిలుస్తున్నారు. పనులు చేయడానికి సామర్థ్యం, అర్హతలు ఉన్నప్పటికీ తగిన ఉద్యోగం దొరక్క బతకడానికి సరిపడా జీతం రానివారికి యూబీఐని ఇవ్వాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ‘వుయ్ వాంట్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్’ అంటూ ఏఐ కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకొన్న పలువురు ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్నారు. అయితే, యూబీఐతో ఉత్పాదకత శక్తి తగ్గిపోతుందని, పనిచేసేవారు కూడా సోమరులుగా మారి దేశాల ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలే ప్రమాదం రావొచ్చన్న విమర్శలూ ఉన్నాయి.
ఏఐ.. మనిషి కాదు: సత్య నాదెళ్ల
Nadella
ఏఐ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా మారిందని, మనిషి చేసే పనులన్నీ ఏఐ ద్వారా చేయవచ్చునని వస్తున్న వార్తలను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తోసిపుచ్చారు. ఏఐ అనేది ఒక టూల్ మాత్రమేనని, దానిని మనుషులతో సమానంగా చూడొద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు బ్లూమ్బర్గ్ టీవీతో మాట్లాడారు. ‘సాధారణంగా మనుషుల గురించి మాట్లాడేటప్పుడు క్రియలు, నామవాచకాలను సూచిస్తారు. అయితే ఏఐ అనేది ఒక టూల్ మాత్రమేనని నేను నమ్ముతున్నా. ఈ సాఫ్ట్వేర్ ప్రదర్శించే సామర్థ్యాలు మానవ మేధస్సుకు సమానం కాదని మనం అర్థం చేసుకోవాలి. ఏఐకి చాలా తెలివితేటలున్నాయి. అయితే మనిషి తెలివి తేటలకు అవి సాటిరావు’ అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
కడవేర్గు రాజశేఖర్