గత ఏడాది శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నా, తెలంగాణలో మాత్రం ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహిన్టన్ నారీమన్ హర్షం వ్యక్తం చేశారు. మత సామరస్యం విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ‘సిటిజన్స్ అండ్ లాయర్స్ ఇన్షియేటివ్’ అనే సంస్థ ‘క్రోథ మార్గం: మత ప్రదర్శనల సాయుధీకరణ’ పేరుతో విడుదల చేసిన నివేదిక రాసిన ముందుమాటలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా తీవ్రస్థాయి హింసాకాండ చోటుచేసుకున్న తొమ్మిది రాష్ర్టాల గురించి ఈ నివేదికలో తెలిపారు. దీనికి రోహిన్టన్ రాసిన ముందుమాటలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
‘గత ఏడాది శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణలో హిందూ ముస్లిం ప్రజానీకం మధ్య ఉన్న సౌభ్రాతృత్వం మరోమారు వెల్లివిరిసింది. ప్రజల మధ్య శాంతి, సోదరభావం నిలిచి ఉండేలా తెలంగాణ పోలీసు దళాలు, రాష్ట్ర హైకోర్టు గొప్ప కృషిచేశాయి.
భారత రాజ్యాంగంలోని పీఠిక, ప్రాథమిక బాధ్యతల అధ్యాయంలో పేర్కొన్న రాజ్యాంగ విలువలు, పౌరుల ప్రాథమిక బాధ్యతల గురించి అన్ని రాష్ర్టాల పోలీసులకు తెలియజేయాలి. భారతదేశంలోని ముస్లింలు కూడా భారతీయులే అన్నది వారికి తొలుత అర్థం చేయించాలి. శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా హింసాకాండ చోటు చేసుకున్న గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లోనే మైనారిటీ వర్గానికి చెందిన 100 మంది వ్యక్తులు గాయపడ్డారు.
ఇద్దరు మరణించారు. భారతీయ ముస్లింలు విడిగా ఒక ప్రత్యేక జాతి కాదు. ఇతరుల్లాగే వారు కూడా భారతీయులే. ఈ మౌలిక విషయం అన్ని రాష్ర్టాల పోలీసు దళాల్లోకి వెళ్తే పరిణామాలు సానుకూలంగా ఉంటాయి. దీంతోపాటు పోలీసు విధుల్లో రాజకీయ జోక్యం లేకుండా చూడటానికి ఏదో ఒక మార్గాన్ని తప్పనిసరిగా వెత కాలి. మత సామరస్యాన్ని, సోదరభావాన్ని సాధించే సుదీర్ఘ కృషికి ఇదొక కొత్త ప్రారంభాన్నిస్తుంది. ఈ సోదరభావం వల్లనే ప్రతీ భారతీయ పౌరుడి ఆత్మగౌరవానికి రక్షణ లభిస్తుంది.
బ్రిటిష్ వారి విభజించు-పాలించు విధానాన్ని తిరస్కరించి ప్రజాస్వామ్య, లౌకిక దేశంగా ఉండే మార్గాన్ని భారతదేశం ఎంచుకున్నది. ఏ మతం వారి వైపూ మొగ్గు చూపకుండా రాష్ట్రప్రభుత్వాలు శాంతిభద్రతలను తటస్థ మార్గంలో నిర్వహించాలి. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ మాత్రమే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా మార్చగల దు. సోదరభావం, వ్యక్తుల ఆత్మగౌరవ పరిరక్షణ, దేశ ఐక్యత-వీటికి కూడా రాజ్యాంగ పీఠిక అమిత ప్రాధాన్యం ఇచ్చింది’.